TSRTC: ఆర్టీసీ ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ABN, First Publish Date - 2022-11-14T09:28:24+05:30
నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగనున్న నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఈవీ చార్జింగ్ స్టేషన్లపై దృష్టిసారించింది

గ్రేటర్ జోన్లో 28 డిపోల పరిశీలన
మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో 10 చార్జింగ్ పాయింట్లు
హైదరాబాద్ సిటీ: నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగనున్న నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఈవీ చార్జింగ్ స్టేషన్లపై దృష్టిసారించింది. 2-3 నెలల్లో 350 ఎలక్ర్టిక్ బస్సులు తీసుకురానున్న నేపథ్యం లో గ్రేటర్జోన్ పరిధిలోని 28 డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఒక్కో డిపోలో 5-10 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ తీసుకువచ్చే ఎలక్ట్రికల్ బస్సుల్లో 300 సమీప జిల్లాలకు నడిపితే, 50 బస్సులు గ్రేటర్జోన్లో నడిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే 39 ఎలక్ట్రిక్ బస్సులను నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నడుపుతున్నారు. వీటి చార్జింగ్ కోసం మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో 10 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులు పెంచేదిశగా ఆర్టీసీ ప్రయత్నిస్తుండటంతో భవిష్యత్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్ నెలకొననుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు పెంచనున్నారు.
అదనపు ఆదాయం
ఎలక్ట్రిక్ బస్సులు, వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో పెద్దసంఖ్యలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అవకాశాలపై కూడా ఆర్టీసీ దృష్టిసారిస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాన రహదారులు, ముఖ్య ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే అదనపు ఆదాయం వస్తుందని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు. రోజూ లక్షల మంది రాకపోకలు సాగిస్తున్న ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునే అవకాశాలను ఆర్టీసీ పరిశీలిస్తోంది.
Updated Date - 2022-11-14T09:28:26+05:30 IST