మట్టి.. కొల్లగొట్టి...!
ABN, First Publish Date - 2023-06-18T22:10:43+05:30
దర్శి ప్రాంతంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మట్టిమాఫియా కొండలను గుల్ల చేస్తోంది. రాత్రికిరాత్రే కొండలను పిండి చేస్తున్నారు. ప్రభుత్వ భూములను చెరబట్టి యథేచ్ఛగా మట్టి తవ్వి తరలిస్తున్నా మైనింగ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

దర్శి మండలంలో పలుచోట్ల జోరుగా అక్రమ రవాణా
కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు
రాత్రిళ్లు పథకం ప్రకారం తవ్వి తరలించడం
చోద్యం చూస్తున్న అధికారులు
దర్శి, జూన్ 18 : దర్శి ప్రాంతంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మట్టిమాఫియా కొండలను గుల్ల చేస్తోంది. రాత్రికిరాత్రే కొండలను పిండి చేస్తున్నారు. ప్రభుత్వ భూములను చెరబట్టి యథేచ్ఛగా మట్టి తవ్వి తరలిస్తున్నా మైనింగ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వివరాల్లోకెళ్తే...
మండలంలోని వెంకటచలంపల్లి కొండ, చలివేంద్ర కొండ, చందలూరు కొండలు మట్టిమాఫియాదెబ్బకు బోడిగుండు అవుతున్నాయి. మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికశాతం మట్టిని రియల్టర్లు వేస్తున్న అక్రమ లేఅవుట్లకు తోలుతున్నారు. అదేవిధంగా తానంచింతలలోని కొండపోరంబోకు భూమిలో, బొట్లపాలెంలోని పశువులమేత పోరంబోకు భూమిలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.
పిల్లికాపురంలా మట్టి తవ్వకాలు
అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారాన్ని పిల్లికాపురంలా సాగిస్తున్నారు. ఓ పథకం ప్రకారం కొన్నిరోజులు ఒక ప్రాంతంలో, మరికొన్ని రోజులు ఇంకో ప్రాంతంలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగించేందుకు అక్రమార్కులు ఈ ఎత్తుగడ వేసినట్లు ప్రజలు చెబుతున్నారు. అక్రమార్కులు రాత్రిపూట మట్టి తరలింపు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పగలు అసలు ఏం జరిగిందో తెలియనట్లు మౌనంగా ఉంటున్నారు.
మైనింగ్, రెవెన్యూ అధికారుల లాలూచీ
మైనింగ్ శాఖ అధికారులు మట్టి అక్రమ తరలింపును అరికట్టాల్సి ఉండగా అక్రమార్కులతో లాలూచీ పడి చోద్యంచూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా రెవెన్యూ అధికారులు సైతం ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వుతున్నా పట్టించుకోవటం లేదు. అధికారులు పూర్తిగా సహకరిస్తుండటంతో మట్టి అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి కొండల రూపురేఖలు కోల్పోయే పరిస్థితి నెలకొంది.
అక్రమార్కులు తమ అక్రమ వ్యాపారాన్ని పిల్లికాపురంలా సాగిస్తున్నారు. ఓ పథకం ప్రకారం కొన్నిరోజులు ఒక ప్రాంతంలో, మరికొన్ని రోజులు ఇంకో ప్రాంతంలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగించేందుకు అక్రమార్కులు ఈ ఎత్తుగడ వేసినట్లు ప్రజలు చెబుతున్నారు. అక్రమార్కులు రాత్రిపూట మట్టి తరలింపు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పగలు అసలు ఏం జరిగిందో తెలియనట్లు మౌనంగా ఉంటున్నారు.
అక్రమ మట్టి తరలింపు పట్ల ఆయా ప్రాంత ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో వివిధ గ్రామాల ప్రజలు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. జిల్లా, డివిజన్స్థాయి అధికారులు వచ్చినప్పుడు కొంతకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత మళ్లీ మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండలను కొల్లగొట్టకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-06-18T22:34:33+05:30 IST