జీవో నంబరు 117ను రద్దు చేయాలి
ABN, First Publish Date - 2023-12-04T01:13:07+05:30
విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న జీవో నంబరు 117ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనకాపల్లి టౌన్, డిసెంబరు 3: విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న జీవో నంబరు 117ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా శాఖ యూటీఎఫ్ ద్వితీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. తొలుత యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు నెల్లి సుబ్బారావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చినబ్బాయి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. అలాగే మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, జీవో నంబరు 117ను రద్దు చేసి, జీపీఎస్ను ఎత్తివేసి ఓపీఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేస్తున్న అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని లేకుంటే యూటీఎఫ్ పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. గౌరవాధ్యక్షుడు నెల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. సమావేశంలో యూటీఎఫ్ ప్రతినిధులు జీఎస్ ప్రకాష్, జోగా రాజేష్, పొలిమేర చంద్రరావు, కళింగ సతీష్, యల్లయ్యబాబు, సుభాషిణిదేవి, గెంజి నాగేశ్వరరావు, శేషుకుమార్, రమేష్రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-04T01:13:08+05:30 IST