ఏమిటీ మిస్టరీ?
ABN, First Publish Date - 2023-06-05T02:10:03+05:30
డ్రైవర్ తప్పిదం లేదు. సిగ్నల్ సరిగ్గానే ఉంది. అయినప్పటికీ... మెయిన్ లైన్లో భద్రంగా వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి వెళ్లి... అక్కడున్న ...
కోరమాండల్ ప్రమాదంపై అనేక అనుమానాలు
(విశాఖపట్నం – ఆంధ్రజ్యోతి)
డ్రైవర్ తప్పిదం లేదు. సిగ్నల్ సరిగ్గానే ఉంది. అయినప్పటికీ... మెయిన్ లైన్లో భద్రంగా వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి వెళ్లి... అక్కడున్న గూడ్స్ను ఢీకొంది. అన్నీ బాగుంటే... ఈ ‘తప్పిదం’ ఎలా జరిగింది? ‘పాయింట్ మిషన్’ సెట్టింగ్ మార్చడం వల్లే కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి వెళ్లిందని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ‘పాయింట్ పుష్ ఫెయిల్యూర్’ జరిగి ఉండొచ్చని తెలిపింది. అసలు... శుక్రవారం రాత్రి బహనాగ్ బజార్ రైల్వేస్టేషన్ వద్ద ఏం జరిగి ఉండొచ్చు? వివిధ వర్గాలు అందించిన సమాచారంతో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. బహనాగ్ రైల్వేస్టేషన్లో నాలుగు లైన్లు ఉన్నాయి. మధ్యలో రెండు మెయిన్ లైన్లు. అటూ ఇటూ ఉన్నవి లూప్లైన్లు. మెయిన్లైన్లో రైలు వెళ్తున్నపుడు స్టేషన్ మాస్టర్ గదిలోని ప్యానల్ బోర్డులో గ్రీన్ కలర్ చూపిస్తోంది. రైలు పాయింట్ దాటి వెళ్లిపోగానే అక్కడ రెడ్ లైన్ వస్తోంది. ఒకానొక దశలో ఎడమ వైపు ఎల్సీ (లెవెల్ క్రాసింగ్) 95 వద్ద గ్రీన్సిగ్నల్ ఉండగా, కుడి వైపు ఉన్న ఎల్సీ రెడ్ సిగ్నల్ చూపిస్తోంది. ఇదే అసలు మిస్టరీ. ఎందుకంటే... రెండు ఎల్సీలు ఒకే సిగ్నల్ చూపించాలి. కుడివైపు ఎల్సీ రెడ్ సిగ్నల్ ఉండటమే కాకుండా పక్కనే ఉన్న పాయింట్ అప్లైన్ నుంచి డౌన్ లైన్కు కనెక్ట్ అయింది. సాంకేతికంగా చూస్తే ఇలా జరగకూడదు. అంటే.. అక్కడే ఏదో తేడా జరిగింది. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు ఆ లైన్లో మరమ్మతులు జరిగాయి. అది కూడా సిగ్నల్ పాయింట్ వద్దే పనులు చేశారు. అవి సరిగ్గా చేశారా? లేదా? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. ఎందుకంటే... గూడ్సురైలును మెయిన్ లైన్ నుంచి లూప్లైన్లోకి మార్చిన తర్వాత కోరమాండల్కు లైన్ క్లియర్ చేశారు. ప్యానల్ బోర్డులో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ బాగానే ఉంది. కానీ ఫిజికల్గా క్రాసింగ్ పాయింట్ దగ్గర అలా లేదు. దాంతో అక్కడి నుంచి కోరమాండల్ లూప్లైన్లోకి వెళ్లిపోయింది. ఇలా జరగడానికి రెండు కారణాలు ఉంటాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెయిన్ లైన్ త్రూ అయినట్టు గ్రీన్సిగ్నల్ వచ్చినా లూప్లైన్లో రివర్స్ (రెడ్ రాకపోవడం) అవ్వకపోవడం సాంకేతికంగా ఒక లోపం.
‘పాయింట్’ పుష్ చేయలేదా?
గూడ్స్ రైలును లూప్లైన్లోకి పంపించాక... కోరమాండల్ మెయిన్లైన్లోనే వెళ్లేలా ‘పాయింట్ పుష్’ (ట్రాక్ మార్చడం) చేయాలి. మెయిన్లైన్లో కోరమాండల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పాయింట్ పుష్ మోటర్ ఆపరేట్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఎక్స్ప్రెస్ రైలు వచ్చేలోగా ఎవరైనా లెవెల్ క్రాసింగ్ వద్ద ‘రివర్స్’ చేసి ఉంటారా? అనే సందేహమూ తలెత్తుతోంది. సంబంధిత సెట్టింగ్స్ ఎవరో మార్చారని రైల్వే మంత్రి సైతం ఇదే మాట చెప్పారు. అయితే... ఎవరో కావాలనే సెట్టింగ్స్ మార్చడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక దశలో... ఒక వ్యక్తి చేయగలిగే పని కాదని పేర్కొంటున్నారు. ఆ సెక్షన్లో పనిచేస్తున్న వారికి మాత్రమే దీని గురించి తెలుస్తుందని చెబుతున్నారు.
ఇంటర్ లాకింగ్ అంటే ఏమిటి?
రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో ఇది అంతర్భాగం. స్టేషన్ మాస్టర్ తన గదిలో నుంచే కంప్యూటర్ సాయంతో రైళ్ల పట్టాలను మార్చవచ్చు. ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ.. వచ్చే, పోయే రైళ్లకు పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థ ఇది. రైలు ప్రయాణించాల్సిన మార్గం పూర్తిగా సురక్షితం అని తేలేవరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఇది ఆపుతుంది.
‘ఫెయిల్ సేఫ్’ ఏమైంది?
రైల్వే సిగ్నలింగ్లో అత్యాధునిక సాంకేతిక విధానాలను అనుసరిస్తున్నారు. అందులో... ‘ఫెయిల్ సేఫ్ సిస్టమ్’ కూడా ఒకటి. అంటే... ఒకచోట సిగ్నల్ విఫలమైతే ఆటోమేటిక్గా ఇతర అన్ని ట్రాక్లలో సిగ్నల్ రెడ్ వస్తుంది. అన్ని రైళ్లూ ఆగిపోతాయి. దీనిద్వారా ప్రమాదాన్ని నివారించగలుగుతారు. మరి... కోరమాండల్ విషయంలో ‘ఫెయిల్ సేఫ్ సిస్టమ్’ ఎందుకు పనిచేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది.
Updated Date - 2023-06-05T02:10:03+05:30 IST