YCP : వైసీపీ బీభత్సం
ABN, First Publish Date - 2023-09-06T03:08:05+05:30
లోకేశ్ యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు..
లోకేశ్ పాదయాత్రపై కర్రలు, రాళ్లతో దాడి
మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు గాయాలు
కానిస్టేబుల్ సహా పలువురు టీడీపీ కార్యకర్తలకూ
సభ సక్సెస్ కావడంతో యువగళంపై దాడికి వైసీపీ ప్లాన్
రాళ్లు, కర్రలు, కూల్డ్రింక్ బాటిళ్లు ముందుగానే సిద్ధం
ఇళ్ల వెనుక నుంచి దాడి.. ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు
జెండా కర్రలతో ఎదురుదాడి.. వైసీపీ శ్రేణుల పలాయనం
దేశం కార్యకర్తలపైనే లాఠీచార్జి.. లోకేశ్ తీవ్ర నిరసన
పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ముందుకు
భీమవరం/భీమవరం రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): లోకేశ్ యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు.. వీధి రౌడీల్లా వ్యవహరించి ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో
విరుచుకుపడ్డారు. ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగడంతో పలాయనం చిత్తగించారు. వైసీపీ దాడులను వారించని పోలీసులు.. టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి చేశారు. వైసీపీ పోలీసులతోపాటు పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం లోకేశ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. తన ప్రసంగంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అవినీతిపై విరుచుకుపడ్డారు. ఆయన గజదొంగ.. భూబకాసురుడు.. భీమవరానికి పట్టిన కేన్సర్ గడ్డ అని నిప్పులు చెరిగారు. తక్కువ రేటుకు స్థలం కొని అదే భూమిని జగనన్న ఇళ్ల కోసం అధిక ధరలకు విక్రయించారని.. రూ.52 కోట్ల భూకుంభకోణంలో వాటా తీసుకున్నారని.. ఆయన అవినీతిపై వైసీపీ నాయకులే సీఎం జగన్కు ఫిర్యాదు చేస్తే వారిపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. సభ సక్సెస్ కావడం, ఎమ్మెల్యేపై విమర్శలతో జీర్ణించుకోలేని స్థానిక వైసీపీ శ్రేణులు ఎలాగైనా గొడవకు దిగాలని నిర్ణయించుకున్నారు. పాదయాత్రపై దాడికి సర్వం సిద్ధం చేసుకున్నారు. లోకేశ్ సభ ముగించుకుని వేల మంది కార్యకర్తలు వెంట రాగా ముందుకు నడిచారు. అప్పటికే పాదయాత్ర దారిలోని తాడేరు వంతెన వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దాడి చేసేందుకు రాళ్లు, కర్రలు, కూల్ డ్రింక్ బాటిళ్లు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం పోలీసులకు, టీడీపీ నాయకులకు కూడా తెలిసింది. రాత్రి 7.30 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తాడేరు వంతెన వద్దకు వెళ్లారు. అప్పటికే వైసీపీ కార్యకర్తలు 30 మంది మద్యం సేవించి తుళ్లుతూ, తూలుతూ.. జై జగన్, జై గ్రంధి శ్రీనివాస్, లోకేశ్ గో-బ్యాక్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. చేతిలో జెండాలు పట్టుకుని పూనకం వచ్చినట్లు ఊగిపోతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివపై పేడ వేశారు. అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారు. పోలీసులు వైసీపీ శ్రేణులను వారించే ప్రయత్నం చేయలేదు. ఈలోపు పాదయాత్ర వంతెనను సమీపించడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలను తాడుతో వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. వెనక్కి పరుగులు తీసిన వైసీపీ కార్యకర్తలు.. అక్కడ ముందే ఉంచిన రాళ్లు అందుకున్నారు. ఇళ్ల పైకి ఎక్కి.. వెనక్కి వెళ్లి.. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. పలువురు గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ మూకలపై రాళ్లు రువ్వారు. అటు వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి.. మరింత ఉధృతంగా రాళ్ల వర్షం కురిపించారు. స్థానికులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. వైసీపీ రాళ్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు గాయమైంది. ఓ కానిస్టేబుల్కు తల పగిలి రక్తం కారింది. మూడు కుట్లు పడ్డాయి. మరో ఏఎ్సఐ, బాలుడితోపాటు మరికొందరికి దెబ్బలు తగిలాయి. యువగళం కాన్వాయ్లో ఉన్న రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనిపై మండిపడిన టీడీపీ కార్యకర్తలు సంయమనం వీడి.. ఒక్క ఉదుటున వైసీపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. అప్పటి వరకు చోద్యం చూస్తున్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలపైనే జులుం ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలనూ పంపేశారు. అయుతే వారు వెనక్కి వెళ్లినట్లే వెళ్లి తిరిగొచ్చి మరీ దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. జెండా కర్రలతో దొరికిన వారిని దొరికినట్లు బాదారు. అప్పుడు వైసీపీ కార్యకర్తలు వెనక్కి పరుగులు తీశారు. దాదాపు 20 నిమిషాలపాటు ఉద్రిక్తత సాగింది. వైసీపీ బీభత్సాన్ని నిరసిస్తూ లోకేశ్ నిరసనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. దీంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగి టీడీపీ నాయకులకు నచ్చజెప్పారు. అనంతరం పాదయాత్ర ముందుకు సాగింది. వైసీపీ వీరంగం వెనుక స్థానిక నేత హస్తం ఉందంటూ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.
పోలీసులు, టీడీపీ బాహాబాహీ
భీమవరంలో ‘పేదలపై పెత్తందార్ల యుద్ధం’ పేరిట వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర వివాదం రేపింది. లోకేశ్ బహిరంగ సభ వేదిక వెనుక వంతెనపై ఉన్న ఈ ఫ్లెక్సీని తొలగించాలని టీడీపీ కార్యకర్తలు పట్టుబట్టారు. కొందరు రాళ్లు తీసుకుని ఫ్లెక్సీపై విసరడంతో వన్టౌన్, టూ టౌన్ సీఐలు సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు ‘బాబాయిని హత్య చేసిన అబ్బాయి’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో స్పెషల్ పోలీసులు వచ్చి వారిని అడ్డుకున్నారు. ఉభయుల నడుమ బాహాబాహీ జరిగింది. కొంత మంది కార్యకర్తలను పోలీసు స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారిని వదిలేశారు.
Updated Date - 2023-09-06T03:08:05+05:30 IST