కొత్త ఏడాదిలో కార్లు మరింత ప్రియం
ABN, First Publish Date - 2023-11-28T02:54:32+05:30
కొత్త సంవత్సరంలో కార్లు మరింత ప్రియం కానున్నాయి. 2024 జనవరిలో ప్యాసింజర్ వాహన ధరలను పెంచబోతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా సోమవారం ప్రకటించింది...
జనవరిలో మారుతి, ఆడి, ఎం అండ్ ఎం కార్ల ధరల పెంపు
అదేబాటలో టాటా మోటార్స్, బెంజ్, ఇతర వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో కార్లు మరింత ప్రియం కానున్నాయి. 2024 జనవరిలో ప్యాసింజర్ వాహన ధరలను పెంచబోతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా సోమవారం ప్రకటించింది. వాహన ఉత్పత్తికి అవసరమైన కమోడిటీల ధరలతో పాటు ఉత్పత్తి ఖర్చులన్నీ పెరగడాన్ని ఇందుకు కారణంగా చెబుతోంది. అయితే, ఎంత మొత్తంలో పెంచ నున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మోడల్ను బట్టి ధర పెరుగుదల మారనుందని, ఈసారి పెంపు గణనీయం గానే ఉండనుందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఏయే మోడల్పై ఎంత పెంచాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ అయిన మారుతి సుజుకీ.. చిన్న కారు ఆల్టో నుంచి మల్టీ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ) ఇన్విక్టో వరకు పలు మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ప్రస్తుత ధరల శ్రేణి రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల స్థాయిలో ఉంది. మారుతి చివరిసారి ఈ ఏప్రిల్లో కార్ల ధరలను 0.8 శాతం మేర పెంచింది. గత ఆర్థిక సంవత్సరం (2022 మార్చి నుంచి 2023 ఏప్రిల్ వరకు)లో మారుతి కార్ల రేట్లు పలు విడతల్లో 2.4 శాతం పెరిగాయి. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తెలిపింది. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరగడం ఇందుకు కారణంగా పేర్కొంది. కంపెనీకి చెందిన అన్ని మోడళ్ల రేట్లను పెంచనున్నట్లు ఆడి స్పష్టం చేసింది. భారత మార్కెట్లో ఆడీ క్యూ3 ఎస్యూవీ నుంచి స్పోర్ట్స్ కార్ ఆర్ఎస్ క్యూ8 వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల శ్రేణిలో ఉన్నాయి.
కాగా, జర్మనీకి చెందిన మరో లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ కూడా కొత్త ఏడాదిలో రేట్లు పెంచాలనుకుంటున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ విషయంలో కంపెనీ ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. దేశీయ కార్ల కంపెనీల విషయానికొస్తే, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) సైతం జనవరి నుంచి కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఏ మోడల్పై ఎంత పెంచనున్న విషయాన్ని ఈ ఏడాది చివర్లో వెల్లడించ నున్నట్లు తెలిపింది. టాటా మోటార్స్ సైతం మారుతి సుజుకీ బాటను అనుసరించే ఆలోచనలో ఉంది. ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరలను జనవరి నుంచి పెంచాలని యోచిస్తోంది. టాటా మోటార్స్ తన ఎంట్రీలెవెల్ హ్యాచ్బ్యాక్ టియాగో నుంచి ప్రీమియం ఎస్యూవీ సఫారీ వరకు పలు కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ప్రస్తుత ధరలు రూ.5.6 లక్షల నుంచి రూ.25.94 లక్షల శ్రేణిలో ఉన్నాయి.
Updated Date - 2023-11-28T02:54:33+05:30 IST