Congress: యోగీజీ..సనాతన ధర్మం సరే, ఇతర మతాలకు చోటుందా? లేదా?
ABN, First Publish Date - 2023-01-28T16:06:10+05:30
సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ) చేసిన వ్యాఖ్యలు కలకలం...
న్యూఢిల్లీ: సనాతన ధర్మం (Sanatan Dharma)పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ (Udit Raj) మండిపడ్డారు. వరుస ప్రశ్నలు సంధించారు. ఇతర ధర్మాల మాటేమిటని యోగి ఆదిత్యనాథ్ను ప్రశ్నించారు. అసలు ఇతర మతాలకు చోటుందా? లేదా? సనాతన ధర్మంలో దళితులు, మహిళలకు చోటు ఏదని నిలదీశారు.
''బౌద్ధమతానికి చెందిన కొందరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. దాని అర్థం ఏమిటి? ఇతర ధర్మాల సంగతేమిటనే కదా? వీటికి సంబంధించిన వివరణ ఇవ్వాలి. పురాతనకాలం నాటి ధర్మం సనాతన ధర్మం. దానిని నేను గౌరవిస్తాను. సనాతన ధర్మాన్ని నిరాకరించేవారిని ఫూల్స్ అనే చెప్పాలి. నా ప్రశ్న ఒక్కటే. ఇతర మతాల వారికి చోటు ఉందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలి'' అని ఉదిత్ రాజ్ అన్నారు. దళితలు, మహిళలకు సనాతన ధర్మంలో చోటు ఏదని ప్రశ్నించారు.
యోగి ఏమన్నారు?
సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్లోని జాలౌర్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పునఃస్థాపన జరగాలని అన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు. కాగా, యోగి వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రామ్చరిత్ మానస్ను నిషేధించాలంటూ సమాజ్వాదీ పార్టీ నేత మౌర్య డిమాండ్ చేయడానికి కౌంటర్గానే యోగి తాజా వ్యాఖ్యలు చేసినట్టు వారు భావిస్తున్నారు. మరి కొందరు భారత్ను హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారనే ప్రచారానికి యోగి తాజా వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయని అంటున్నారు.
Updated Date - 2023-01-28T16:06:11+05:30 IST