SI Rajender arrested : సీజ్ చేసిన డ్రగ్స్ను నొక్కేశాడు
ABN, First Publish Date - 2023-08-28T05:07:05+05:30
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినబూనారు.
మార్కెట్లో అమ్మేందుకు ఆర్నెల్లుగా ఎస్సై స్కెచ్
ఉప్పందుకున్న టీ-న్యాబ్ పోలీసులు
ఎస్సై రాజేందర్ అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
రూ.80 లక్షల విలువైన 1,750 గ్రాముల మెథాకొలిన్ సీజ్
రాయదుర్గం/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినబూనారు. వెయ్యిమంది మెరికెల్లాంటి పోలీసులతో తెలంగాణ నార్కోటిక్స్(టీ-న్యాబ్) వింగ్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోనూ రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే చెబుతుంటారు. డ్రగ్స్ మూలాలకు వెళ్లి, కింగ్పిన్లనూ అరెస్టు చేశారు. అయితే.. ఓ కేసులో డ్రగ్స్ సీజ్ అవ్వగా.. ఆ మొత్తాన్ని నొక్కేసిన ఓ ఎస్సై దర్జాగా ఆ మత్తుమందును మార్కెట్లో అమ్మేందుకు యత్నించారు. అతని ఆటను టీ-న్యాబ్ వింగ్ కట్టించడంతో.. కటకటాలపాలయ్యారు. పోలీసులు, విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. సైబరాబాద్ సైబర్క్రైమ్స్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజేందర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ డ్రగ్స్ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి ముంబై వెళ్లారు. అక్కడ కొందరు నైజీరియన్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.80 లక్షల విలువైన 1,750 గ్రాముల మెథాకొలిన్ డ్రగ్స్ను సీజ్ చేశారు. నైజీరియన్లను కోర్టులో హాజరుపరిచే సమయంలో.. ఎస్సై రాజేందర్ డ్రగ్స్ను నొక్కేశారు. నగదు, సెల్ఫోన్లను మాత్రం సీజ్ చేసినట్లుగా పేర్కొంటూ.. వాటిని కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తాను నొక్కేసిన డ్రగ్స్ను కస్టమర్లకు విక్రయించి, సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కస్టమర్ల కోసం రహస్యంగా ఆరా తీశారు. ఈ విషయంపై టీ-న్యాబ్ పోలీసులకు ఉప్పందడంతో.. రాజేందర్ కదలికలపై నిఘా పెట్టారు. చివరికి తమ బృందంలోని ఓ వ్యక్తిని కస్టమర్లా పంపించి, బేరసారాలు చేయించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో, అతని ఇంట్లో డ్రగ్స్ నిల్వ ఉన్నట్లు నిర్ధారించుకుని, దాడి చేసి, అరెస్టు చేశారు. అతని నుంచి 1,750 గ్రాముల మెథాకొలిన్ డ్రగ్స్ను సీజ్ చేశారు. దర్యాప్తు నిమిత్తం నిందితుడిని, సీజ్ చేసిన డ్రగ్స్ను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాజేందర్పై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.
ఏసీబీ కేసుతో.. పదోన్నతికి బ్రేకులు
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రాజేందర్ 2009 బ్యాచ్ ఎస్సైగా ఎంపికయ్యారు. గతంలో రాయదుర్గం ఠాణాలో ఎస్సైగా పనిచేశారు. గచ్చిబౌలిలోని ఓ సివిల్ వివాదంలో తలదూర్చగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. రాజేందర్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా రు. ఆ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో అతణ్ని సర్వీసు నుంచి తొలగించగా.. రాజేందర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ విధుల్లో చేరి, కొంతకాలం మాదాపూర్ అడ్మిన్ ఎస్సైగా పనిచేశారు. ఆ తర్వాత సైబరాబాద్ సైబర్క్రైమ్స్ విభాగానికి బదిలీ అ య్యారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న 2009 బ్యాచ్ ఎస్సైలకు ఇటీవలే ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులొచ్చినా.. ఏసీబీ కేసు, రెండేళ్ల శిక్ష, ప్రవర్తన వంటి కారణాలతో రాజేందర్కు ప్రమోషన్ రాలేదని తెలుస్తోంది.
Updated Date - 2023-08-28T05:07:05+05:30 IST