Enforcement Directorate: విచారణకు రండి
ABN, First Publish Date - 2023-03-09T02:32:10+05:30
ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
నేడు రావాలని కవితకు ఈడీ సమన్లు
10న ధర్నా ఉంది.. రాలేను.. ఈడీకి తెలియజేసిన ఎమ్మెల్సీ
అయితే 11న రావాలని ఆదేశం.. హాజరవుతానని తెలిపిన కవిత
విచారణకు అనేక మార్గాలుండగా ఢిల్లీ పిలిపించడం ఏంటని ప్రశ్న
ఈడీ జాయింట్ డైరెక్టరేట్కు లేఖ
న్యూఢిల్లీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలంటూ బుధవారం నోటీసులు ఇచ్చింది. చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ఈ నెల 10న జంతర్మంతర్లో ధర్నా నిర్వహిస్తున్నానని, ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల తాను రాలేనని కవిత సమాధానం ఇచ్చారు. అయితే ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఈడీ వెంటనే తాఖీదులు పంపింది. తనకు మరింత సమయం కావాలని కవిత కోరుతున్నారని, అయితే ఈడీ స్పందించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తొలుత మరింత గడువు కావాలని కోరినప్పటికీ బుధవారం అర్ధరాత్రి ఈ నెల 11నే విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. కాగా, జంతర్మంతర్లో ధర్నా ఏర్పాట్ల కోసం కవిత బుధవారం రాత్రి మందీ మార్బలంతో ఢిల్లీ చేరుకున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న ఈ ధర్నాను కవితకు సంఘీభావ సభగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రిమాండ్ రిపోర్టుతోనే తేలిపోయింది!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్లు కవితకు బినామీలుగా వ్యవహరించారని ఈడీ ప్రత్యేక కోర్టుకు తెలియజేయడంతో ఆమెను విచారణకు పిలవడం ఖాయమన్న విషయం తేలిపోయింది. తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే మద్యం వ్యాపారంలో చేరామని అరుణ్, ప్రేమ్రాహుల్లు వాంగ్మూలం ఇచ్చినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలియజేయడంతోనే ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుందన్న విషయం అర్థమైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌత్ గ్రూపులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, కవిత ఉన్నారని.. కవిత ప్రయోజనాల కోసమే ఇండో స్పిరిట్స్లో పిళ్లై 32.5ు వాటా తీసుకున్నారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపిన సంగతి తెలిసిందే.
వెంటనే అరెస్టు చేస్తారా?
కవితను ఈడీ విచారణకు పిలిపించిన తర్వాత ఎప్పుడు అరెస్టు చేస్తారన్న విషయంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అరుణ్ పిళ్లైను దాదాపు 29 సార్లు పిలిపించిన తర్వాత ఈడీ అరెస్టు చేసింది. అయితే కవితకు సంబంధించిన మొత్తం వివరాలను పిళ్లైతో పాటు ఇతరులు చెప్పిన తర్వాత ఆమెను పకడ్బందీ సాక్ష్యాలతో విచారించేందుకే ఈడీ ఇప్పటి వరకు ఆగిందని.. ఇక ఆమెను అరెస్టు చేయాలంటే పలుమార్లు విచారణకు పిలవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకటి రెండు రోజులు ప్రశ్నించిన తర్వాత కవితను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
Updated Date - 2023-03-09T07:40:40+05:30 IST