వరి కొయ్యల మంటల్లో చిక్కుకొని అన్నదాత దుర్మరణం!
ABN, First Publish Date - 2023-05-17T02:34:19+05:30
ఓ పొలంలోని వరి కొయ్యలకు అంటించిన నిప్పు.. ఆ పక్క పొలంలోని రైతును బలిగొంది. సూర్యాపేట జిల్లాలో ఈ విషాదం జరిగింది.

గరిడేపల్లి, మే 16: ఓ పొలంలోని వరి కొయ్యలకు అంటించిన నిప్పు.. ఆ పక్క పొలంలోని రైతును బలిగొంది. సూర్యాపేట జిల్లాలో ఈ విషాదం జరిగింది. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన గోళ్ల గంగయ్య (60)కు గ్రామ సమీపంలో రెండెకరాల పొలం ఉంది. యాసంగి వరి సాగు చేసి.. కోతలు కూడా పూర్తి చేశాడు. వ్యవసాయ పనులేమీ లేకపోవడంతో భార్య వీరమ్మతో కలిసి కూలీ పనులకు వెళుతున్నాడు. మంగళవారం ఉదయం ఉపాధి హామీ పథకం కింద తమ పొలం సమీపంలో కాల్వ తవ్వకం పనులకు వెళ్లాడు. తమ పొలం పక్కనే నంద్యాల శేషిరెడ్డి పొలంలోని వరి కొయ్యలకు మంటలంటుకున్నాయి. గమనించిన గంగయ్య, వీరమ్మ కలిసి తమ పొలంలోని నీటి పైపులు కాలిపోకుండా ఉండేందుకు చెట్ల కొమ్మలు విరిచి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గంగయ్య చుట్టూ మంటలు చుట్టుముట్టాయి. భర్తను కాపాడేందుకు వీరమ్మ ప్రయత్నించినా లాభం లేకపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి గంగయ్యను బయటకు తీసేసరికి మృతి చెందాడు.
Updated Date - 2023-05-17T02:34:19+05:30 IST