పంజగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు
ABN, Publish Date - Dec 27 , 2023 | 03:36 AM
ప్రగతి భవన్ ఎదురుగా బ్యారీకేడ్లను ఢీకొన్న ఘటన దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు.. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేస్తూ..

ప్రగతిభవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్ట్లు
అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు
దుబాయ్కి పారిపోయినట్లు అనుమానాలు
సోషల్మీడియాలో వైరల్ అవడంతో
ఇన్స్పెక్టర్ను వివరణ కోరిన డీసీపీ
వెంటనే సస్పెండ్ చేసిన సీపీ శ్రీనివా్సరెడ్డి
ఆస్పత్రిలో చేరిన ఇన్స్పెక్టర్ దుర్గారావు
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రగతి భవన్ ఎదురుగా బ్యారీకేడ్లను ఢీకొన్న ఘటన దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు.. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్సరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి దాటాక.. మద్యం మత్తులో ఖరీదైన కారును నడుపుతూ.. ప్రగతి భవన్ ఎదురుగా ఉన్న బ్యారీకేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో ఇద్దరు యువతులు, సాహిల్, మరో యువకుడు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే సాహిల్ తమ డ్రైవర్ అబ్దుల్ ఆసి్ఫను మరో కారులో పిలిపించాడు. ప్రమాదానికి ఆసి్ఫను కారకుడిగా చూపించాలంటూ తన స్నేహితులకు చెప్పి.. మరో కారులో వెళ్లిపోయాడు. సాహిల్ చెప్పినట్లుగానే.. ఆసిఫ్ పోలీసులతో తానే ప్రమాదానికి కారణమంటూ వాంగ్మూలమిచ్చాడు. సాహిల్ స్నేహితులు కూడా పోలీసులకు ఇదే విషయం తెలిపారు.
అయితే.. ప్రమాదానికి కారకుడు సాహిల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దాంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్సరెడ్డి సీరియస్ అయ్యారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాలతో డీసీపీ విజయ్కుమార్ రంగంలోకి దిగారు. మంగళవారం పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును విచారించారు. సాహిల్ను తప్పించేందుకు జరిగిన కుట్రలో ఇన్స్పెక్టర్ భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. డీసీపీ కార్యాలయం నుంచి బయటకు రాగానే.. ఇన్స్పెక్టర్ అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చేరారు. డీసీపీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీపీ.. మంగళవారం రాత్రి ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ఆసి్ఫను ఏ2గా చేర్చారు. ఆ మేరకు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో.. మొదటి నిందితుడిగా సాహిల్ను పేర్కొన్నారు. కాగా.. సాహిల్ అజ్ఞాతంలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతుండగా.. ఆయన దుబాయ్కి పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీసీటీవీ ఫుటేజీలే ఆధారాలు!
ప్రమాదం జరిగిన ఘటన మొదలు.. సాహిల్ వేరే కారులో వెళ్లే వరకు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు జల్లెడపట్టారు. సాహిల్ కారు వేగంగా దూసుకురావడం.. ప్రగతిభవన్ ఎదుట ఉన్న బ్యారీకేడ్లను ఢీకొట్టడం.. ఆ తీవ్రతకు బ్యారీకేడ్లు గాల్లోకి ఎగిరిపడడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేరే కారులో ఆసిఫ్ రావడం, సాహిల్ ఆ కారులో వెళ్లిపోవడం వంటి ఆధారాలు కూడా ఉన్నట్లు వివరించారు.
Updated Date - Dec 27 , 2023 | 03:36 AM