జిల్లా అంతటా వర్షాలు
ABN, Publish Date - Jan 08 , 2024 | 11:35 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. విడవని జడివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆకాశమంతా మేఘావృతం కావడంతో పాటు చల్లటిగాలులు వీస్తుండటంతో వృద్ధులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. చిత్తూరులో ఆదివారం రాత్రి 10.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.
ఒకటే జడివాన
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 8: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. విడవని జడివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆకాశమంతా మేఘావృతం కావడంతో పాటు చల్లటిగాలులు వీస్తుండటంతో వృద్ధులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. చిత్తూరులో ఆదివారం రాత్రి 10.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. దాంతో ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కొనుగోలుదారులు రాకపోవడంతో వ్యాపారాలు జరగక చిరువ్యాపారులు దెబ్బతిన్నారు. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 22 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలాల వారీగా గుడిపాలలో 14.0, పాలసముద్రంలో 12.2, యాదమరిలో 10.0, శ్రీరంగరాజపురంలో 9.0, నిండ్రలో 7.2, చిత్తూరులో 6.2, బైరెడ్డిపల్లిలో 5.6, నగరిలో 4.6, శాంతిపురంలో 4.6, తవణంపల్లిలో 4.4, విజయపురంలో 3.6, సదుంలో 3.4, కార్వేటినగరంలో 2.4, బంగారుపాళ్యంలో 2.2, పులిచెర్లలో 2.0, గంగాధరనెల్లూరులో 2.0, వి.కోటలో 1.4, పూతలపట్టులో 1.0, గంగవరంలో 1.0, పలమనేరులో 1.0, సోమలలో 1.0, పుంగనూరులో 0.6, పెద్దపంజాణిలో 0.6, పెనుమూరులో 0.4 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. జనవరి నెల సరాసరి వర్షపాతం 4.9 మి.మీ కాగా, సోమవారం నాటికి 3.2 మిమీ వర్షం పడింది.
Updated Date - Jan 08 , 2024 | 11:35 PM