చిన్న పనులూ చేయలేకపోతున్నాం
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:58 PM
గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నిధుల్లేకుండా అల్లాడే పరిస్థితి నెలకొందని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడు అన్నారు.
పంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్నారంటూ సర్పంచుల నిరవధిక దీక్ష
చిత్తూరు, జనవరి 30: గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నిధుల్లేకుండా అల్లాడే పరిస్థితి నెలకొందని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడు అన్నారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం సర్పంచులు చేపట్టిన నిరవధిక రిలే నిరాహారదీక్షలో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్ల హక్కులను కాలరాశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వీరి దీక్షకు టీడీపీ నేతలు దొరబాబు, చంద్రప్రకాష్, కఠారి హేమలత, సీఆర్ రాజన్ సంఘీభావం తెలిపారు. పంచాయతీ నిధులను దారి మళ్లించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పంచాయతీ వ్యవస్థే కనుమరుగైపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారు గ్రామాల్లో పనులు చేయకపోవడంతో ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ దీక్షలో సర్పంచుల సంఘం నేతలు చుక్కా ధనుంజయ యాదవ్, కుప్పాల మురళి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 11:58 PM