అంగన్వాడీలపై సర్కారు ఉక్కుపాదం?
ABN, Publish Date - Jan 03 , 2024 | 01:19 AM
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు వారాలుగా నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై చర్యలకు వైసీపీ ప్రభుత్వం ఉపక్రమిస్తున్నది. ఈ నెల ఐదో తేదీలోగా సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టడడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేయించింది.
5వ తేదీలోగా సమ్మె విరమించాలని అల్టిమేటం
లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ద్వారా ప్రకటన
ప్రభుత్వ వైఖరిపై అంగన్వాడీలు ఆగ్రహ ం
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు వారాలుగా నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై చర్యలకు వైసీపీ ప్రభుత్వం ఉపక్రమిస్తున్నది. ఈ నెల ఐదో తేదీలోగా సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టడడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేయించింది.
గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు గత నెల 12వ తేదీ నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుని తెరిపించింది. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహుకులతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని ప్రయత్నించి మరోమారు విఫలమైంది. తాజాగా జిల్లా కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేసింది. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం చాలా చేసిందని, మిలిగినవి సైతం చేస్తుందని, అంగన్వాడీ కేంద్రాల మూతతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా ఆహార భద్రతా చట్టం అమలుకు విఘాతం కలుగుతున్నందున ఈ నెల ఐదో తేదీలోగా కచ్చితంగా విధుల్లో చేరాలని, లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని పేర్కొన్నారు. అంటే అంగన్వాడీలను పక్కన పెట్టి, ఇతరులతో ఆయా పనులు చేయించుకుని కేంద్రాలను నిర్వహిస్తామని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వ తీరును అంగన్వాడీలు తీవ్రంగా నిరసిస్తున్నారు. సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులు, దౌర్జన్యాలతో తమ ఉద్యమాన్ని నీరుగార్చాలని యత్నించడం సరికాదని అంగన్వాడీలు మండిపడుతున్నారు.
ఐదో తేదీలోగా విధుల్లో చేరాలి
జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ప్రకటన
పాడేరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను విరమించి ఐదో తేదీనాటికి విధుల్లో చేరాలని కలెక్టర్ సుమిత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మె కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని కోరారు. గడువులోగా అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Updated Date - Jan 03 , 2024 | 01:19 AM