హామీల అమలులో నిర్లక్ష్యమెందుకు?
ABN, Publish Date - Jan 09 , 2024 | 11:49 PM
హామీల అమలులో నిర్లక్ష్యమెందుకని పారిశుధ్య కార్మికులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.
పార్వతీపురం టౌన్, జనవరి 9 : హామీల అమలులో నిర్లక్ష్యమెందుకని పారిశుధ్య కార్మికులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగం కార్మికులతో కలిసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీలతో పాటు తమ సమస్యలు పరిష్కరించడంలో మొండి వైఖరి తగదన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.
వామపక్షాల జైల్భరో..
అనంతరం ప్రజా సంఘాల నాయకులు జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీలపై ఎస్మా ఎత్తివేయాలని, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నుదుట పంగనామాలు పెట్టుకుని..
సాలూరు: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సాలూరులో మున్సిపల్ కార్మికులు నినదించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని శిబిరం వద్ద పలువురు కార్మికులు నుదుటపై పంగనామాలు పెట్టుకుని నిరసన తెలిపారు. చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదని, తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేవరకు పోరు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నిరసనలో సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2024 | 11:49 PM