కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు
ABN, Publish Date - Jan 14 , 2024 | 11:33 PM
కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్కు కోవర్టులు ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు.
కరీంనగర్, జనవరి 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్కు కోవర్టులు ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో మానకొండూకర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ పెద్ద ఎత్తున స్కెచ్ వేస్తున్నాడన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నాడన్నారు. కాంగ్రెస్లో ఉన్న కోవర్టులో కేసీఆర్ బేరసారాలు చేస్తున్నాడన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న కేసీఆర్ కోవర్టులకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలే ప్రమాదముందన్నారు. కాంగ్రెస్లో కేసీఆర్కు కోవర్టులున్నారన్నారు. గత ఎన్నికల్లో వాళ్లకు పెద్ద ఎత్తున డబ్బులిచ్చా రన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తుంటే గమనించడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాలోనే ఆ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు అధిక నిధులు వస్తాయన్నారు. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చే వాళ్లమని కేటీఆర్ అంటున్నాడని, పంచొద్దని ఎవరు వద్దన్నారని శ్ర్నించారు. భద్రాద్రిరామాలయానికి తలంబ్రాలు తీసుకురానోడు, వేములవాడ రాజన్నకు, కొండగట్టుకు, దర్మపురి ఆలయాలకు డబ్బలు ఇస్తానని మోసం చేసిన మీకు హిందువుల గురించి, బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలు కేసీఆర్ను మర్చిపోయారని, బయటకు వస్తే పట్టించుకునేదెవరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు గెలువాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తే రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రామమందిర పునఃప్రతిష్టకార్యక్రమం బీజేపీది కాదని, సాధుసంతువులు సూచించిన మంచిమహూర్తం ప్రకారమే చేస్తారన్నారు. ఇది రాజకీయాలకతీతంగా జరిగే కార్యక్రమమన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని తిట్టడం మాని కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేద్దామన్నారు. మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరగా వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 14 , 2024 | 11:33 PM