car accident : జీవితాలు పల్టీ!
ABN, Publish Date - Jan 21 , 2024 | 03:06 AM
డ్రైవర్ మద్యం మత్తో.. నిర్లక్ష్యంతో కూడిన అతివేగమో కానీ ఆ రెండ కార్లు పల్టీ కొట్టాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చొప్పున ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
రెండు వేర్వేరు కారు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
గద్వాల జిల్లాలో కల్వర్టును ఢీకొన్న కారు
ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు
పహాడిషరీ్ఫలో రెయిలింగ్ను ఢీకొన్న కారు
యువతి సహా ముగ్గురి మృతి.. ఇద్దరికి గాయాలు
గద్వాల, పహాడీషరీఫ్, జనవరి 20: డ్రైవర్ మద్యం మత్తో.. నిర్లక్ష్యంతో కూడిన అతివేగమో కానీ ఆ రెండ కార్లు పల్టీ కొట్టాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చొప్పున ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ వేడుకలో పాల్గొన్న ఆరుగురు కారులో తిరిగి వెళుతుండగా వాహనం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటన గద్వాలలో జరిగింది. పహాడీషరీ్ఫలో ఇద్దరు యువతులు సహా ఆరుగురు వెళుతున్న కారు రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాల్లో వాహనాల్లోని మిగతా ఐదుగురు తీవ్రగాయాలయ్యాయి. ఒకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
పుట్టినరోజు వేడుకలో పాల్గొని..
గద్వాలలోని అనంత ఆస్పత్రిలో వెంకటేశ్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన కూతురు పుట్టినరోజు వేడుక శుక్రవారం సాయంత్రం గద్వాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా హాజరయ్యారు. రాత్రి 11గంటల దాకా అక్కడే ఉన్నారు. అనంతరం పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత.. వైద్యుడు వెంకటేశ్ కారులో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు ఆరుగురు బయలుదేరారు. జములమ్మ స్టేజీ దాటిన తర్వాత అదుపుతప్పిన కారు ఓ కల్వర్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా.. కారు పైభాగంలోని సన్రూఫ్ పగిలిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న నరేశ్ (23), పవన్ కుమార్ (28), ఆంజనేయులు (50), గోవర్ధన్, నవీన్, మహబూబ్ రోడ్డుకు బలంగా తగిలి చెల్లాచెదురుగా పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో నరేశ్, పవన్కుమార్, ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. గోవర్ధన్, నవీన్, మహబూబ్కు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నవీన్ పరిస్థితి విషమంగా ఉంది.
రెయిలింగ్ను ఢీకొని..
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. పాతబస్తీ ఫతేదర్వాజకు చెందిన మహ్మద్ సాజిద్(18) శుక్రవారం రాత్రి తన కారులో స్నేహితులు హసన్నగర్కు చెందిన మహ్మద్ అక్బర్(22), లంగర్హౌజ్కు చెందిన నాజియా బేగం (23), హసన్నగర్కు చెందిన నయీముద్దీన్(21), టోలీచౌకికి చెందిన ముస్కాన్ మెహ్ రాజ్(21)ను ఎక్కించుకొని పాతబస్తీ నుంచి పహాడిషరీఫ్ మీదుగా బయలుదేరాడు. మామిడి పల్లి కొండల్లోని రహదారిలో అదాని కంపెనీ సమీపంలో కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలోని సాజిద్, అక్బర్, నాజియా బేగం మృతి చెందారు. మిగిలిన ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి.
Updated Date - Jan 21 , 2024 | 03:06 AM