ఔటర్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ABN, Publish Date - Jan 14 , 2024 | 12:09 AM
ఘట్కేసర్లో ఔటర్ కోసం సేకరించిన భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకొని సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు చింతల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఘట్కేసర్, జనవరి 13: ఘట్కేసర్లో ఔటర్ కోసం సేకరించిన భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకొని సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు చింతల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘట్కేసర్లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు చంద్రమోహన్, సబితతో కలిసి ఆయన మాట్లాడారు. ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి సేకరించిన భూములను పరిరక్షించడంలో హెచ్ఎండీఏ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సర్వీసురోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అప్పటి మంత్రులు వారి స్నేహితుల కోసం, బంధువుల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను వదిలేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 2006వ సంవత్సరంలో బాధితులకు సరైన పరిహారం చెల్లించాలని ఉద్యమం చేసినట్లు గుర్తుచేశారు. హెచ్ఎండీఏ భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణాలు పొందడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘట్కేసర్లోని ఔటర్ జంక్షన్లో మూడు వైపుల సర్వీసు రోడ్లను పూర్తిచేసి కేవలం ఘట్కేసర్ వైపుకు వెళ్లే సర్వీసు రోడ్టునే ఎందుకు పూర్తిచేయలేదని వారు ప్రశ్నించారు. యంనంపేట్ నుంచి ఘట్కేసర్ రావడానికి, ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లడానకి సర్వీసు రోడ్లు కోసం సేకరించిన భూమిలో ఒకవైపు డ్యానో వ్యాక్సిన్ పరిశ్రమ యాజమాన్యం, మరోవైపు మాజీ మంత్రుల స్నేహితులు, అనుచరులు ఫాగా వేశారని ఆరోపించారు. ఈవిషయమై ఈనెల 19న అన్ని పార్టీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామన్నారు.
Updated Date - Jan 14 , 2024 | 12:09 AM