‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్కు మాతృవియోగం
ABN, Publish Date - Jan 07 , 2024 | 04:08 AM
‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ మాతృమూర్తి కండ్లకుంట రంగనాయకమ్మ(86) ఇకలేరు.
రేవంత్, కేసీఆర్.. పలువురు ప్రముఖుల సంతాపం
ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ మాతృమూర్తి కండ్లకుంట రంగనాయకమ్మ(86) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున లంగర్హౌ్సలోని కుమారుడి ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అనంతరం రంగనాయకమ్మ భౌతికకాయాన్ని మన్సూరాబాద్లోని స్వగృహానికి తీసుకెళ్లారు. ఆమె భర్త ప్రముఖ సంస్కృత పండితుడు అళహ సింగరాచార్యులు గత ఏడాది ఆగస్టులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో కె.శ్రీనివాస్ రెండో కుమారుడు. రంగనాయకమ్మ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రంగనాయకమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కె.శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ కూడా సానుభూతిని తెలియజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రంగనాయకమ్మ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన వారిలో.. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, మాజీ సీపీఆర్వో వనంజ్వాలా నరసింహారావు, రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, కల్పన రెంటాల, సజయ కాకర్ల, ఒమ్మి రమేశ్, కవి అఫ్సర్, పాలమూరు అధ్యయన వేదిక నేత రాఘవాచారి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఆంధ్రజ్యోతిలోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులున్నారు. రంగనాయకమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నాగోల్ శ్మశానవాటికలో ముగిశాయి.
Updated Date - Jan 07 , 2024 | 04:08 AM