పల్లెల్లో సంక్రాంతి సందడి
ABN, Publish Date - Jan 14 , 2024 | 12:12 AM
పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి షురువు అయింది. ఈ పండక్కి ప్రతీ యేట సాగే పందాలు మొదలయ్యా యి. ఓ వైపు కోడి పందాలు.. మరోవైపు పేకాట శిబిరాలు వెలిశాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు ఎంట్రీ ఫీజు సైతం ఏర్పాటు చేయడం హాట్ టాఫిక్గా మారింది. మండలంలో పేరున్న వక్తులు దళారుల అవతార మెత్తారు.
మొదలైన కోడి పందాలు, పేకాట శిబిరాలు
కత్తి కట్టేందుకు ఎంట్రీ ఫీజు.. రంగంలోకి దళారులు
రహస్య ప్రదేశాల్లో అడ్డాలు.. అనుమానం రాకుండా జాగ్రత్తలు
పోటాపోటీగా వేలల్లో బెట్టింగులు
ప్రతీ యేట నామమాత్రంగా పోలీసుల చర్యలు.?
కృష్ణకాలనీ(భూపాలపల్లి), జనవరి 13: పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి షురువు అయింది. ఈ పండక్కి ప్రతీ యేట సాగే పందాలు మొదలయ్యా యి. ఓ వైపు కోడి పందాలు.. మరోవైపు పేకాట శిబిరాలు వెలిశాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు ఎంట్రీ ఫీజు సైతం ఏర్పాటు చేయడం హాట్ టాఫిక్గా మారింది. మండలంలో పేరున్న వక్తులు దళారుల అవతార మెత్తారు. అన్నీ తాము చూసుకుంటామంటూ భరోసా ఇస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు బహి రంగంగా చర్చ సాగుతోంది.
పేకాట, కోడి పందాలాట..
సంక్రాంతి వచ్చిందంటే పట్టణాల్లో నివాసముండే వారంతా పల్లెలకు చేరుకుంటారు. సరదా, టైంపాస్ కోసం ఆరాట పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ యేట మాదిరిగానే పేకాట, కోడి పందాలాట కొనసా గుతోంది. వీటి నిర్వహణ కోసం ఇప్ప టికే జిల్లాలోని ఆయా గ్రామాల శివారు ప్రాంతాలు, రహస్య ప్రదేశాలను పందెం రాయుళ్లు ఎంచుకొని సిద్ధం చేసుకున్నారు. పందెంలో పాల్గొనే వారు వేరే వ్యక్తులకు ఆ సమాచారాన్ని ఇవ్వకుండా రహస్యంగా పరుగులు తీస్తున్నట్లు తెలిసింది. గతంలో ఆడే ప్రదేశాలతో పాటు కొత్తగా మరికొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకొని మకాం మార్చి పందాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
బెట్టింగుల పర్వం..
కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్త తరహా పందా లకు కొంత మంది తెర తీసినట్లు ప్రచారం జరుగు తోంది. ఎంట్రీ ఫీజు రూ.200 నుంచి పోటీ అధికంగా ఉండే చోట రూ.500 ఫీజు ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా కాటారం సబ్డివిజన్ పరిధిలోని మారుమూల పల్లెల్లో ఈ తతంగం సాగుతు న్నట్లు సమాచారం. దళారులుగా రంగంలోకి దిగిన వ్యక్తులు పోలీసులతో ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూస్తామనే హామీతో డబ్బులు దండు కుంటున్నట్లు సమాచారం. అలాగే, పోటీల్లో ఉన్న వారు రూ.1000తో మొదలు పెట్టి రూ.20వేల వరకు కూడా బెట్టింగ్ పెట్టేందుకు వెనుకాడటం లేనట్లుగా తెలిసింది. మరోవైపు కోడిపందాల సమీప దూరంలోనే పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి.. లోన బయట పోటీ జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. పేకాట సైతం రూ.10వేలకు పైనే సాగుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఏదైనా ఓ గ్రామంలో పోటీల నిర్వహణ ఉందంటే ఆయా చుట్టుపక్కల గ్రామాల పందెంరాయుళ్లు పోటీ పడి పందెంలో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇతర సుదూర ప్రాంతాల నుంచి పందెం కోళ్లను రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పెట్టి కొనుగోలు చేసి పోటీలోకి దింపుతున్నారు.
ఈ ప్రాంతాల్లోనే అధికం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని ఆయా గ్రామాల్లో కోడి పందాల ఆట, పేకాట ఆరంభమైంది. అయితే, గతంలో పోలీసుల నామమాత్రపు తనిఖీల్లో ఈ గ్రామాల్లోనే అధికంగా ఆటలు సాగిన ఘటనలున్నాయి. ఈసారి సైతం ఇదే గ్రామాల్లో పోటీలు ఉంటాయనే చర్చ బాహాటంగానే సాగుతోంది. కాటారం మండలంలోని దామెరకుంట, గుండ్రాత్పల్లి అటవీ ప్రాంతంలో, మహాముత్తారం మండలంలోని సింగారం, కనుకునూరు, యత్నారం, పెగడపల్లి, బోర్లగూడెం, మహదేవపూర్ మండలంలోని మద్దులపల్లి, పల్గుల, పలిమెల మండలం లోని సింగంపల్లి, ముకునూరు, మల్హర్ మండలంలో ఇప్పలపల్లి, కొండంపేట, తాడిచర్ల శివారు గ్రామాలు ఉన్నాయి. అలాగే, భూపాలపల్లి మండలంలోని పందిపంపుల, దూదేకులపల్లి, దీక్షకుంట గుట్టల్లో, చిట్యాల మండలంలోని అందుకుతండా గ్రామాల్లో సాయంత్రం ఓ వైపు కోడి పందాలు, మరోవైపు పేకాటకు ఢోకా లేకుండా పోతున్నట్లు తెలిసింది.
నామమాత్రపు చర్యలు..?
జిల్లాలో ప్రతీ యేట సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున కోడి పందాలు, పేకాట నిర్వహణ సాగుతోంది. అయితే, వాటి నియంత్రణలో మాత్రం పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీజన్లో అడపా దడపా దాడులు చేస్తూ నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పేరున్న వ్యక్తులతో పాటు చోటా మోటా రాజకీయ నాయకులు సైతం కోడి పందాల నిర్వహణలో పాల్గొంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రధానంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు వాపోతున్నారు. ఈ ప్రాంత పరిధిలోనే ఆట జోరుగా సాగుతుంద నేది బహిరంగ రహస్యమే.
Updated Date - Jan 14 , 2024 | 12:12 AM