Chennai: రాజపాళయంలో రూ.3.5లక్షలకు మగబిడ్డ విక్రయం
ABN, First Publish Date - 2023-11-21T12:23:06+05:30
పుదుకోట జిల్లా రాజపాళయంలో ఏడు రోజుల మగబిడ్డను విక్రయించిన కేసులో తల్లి సహా నలుగురు మహిళలను పోలీసులు
- తల్లి సహా నలుగురి అరెస్టు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): పుదుకోట జిల్లా రాజపాళయంలో ఏడు రోజుల మగబిడ్డను విక్రయించిన కేసులో తల్లి సహా నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. రాజపాళయం సేత్తూరు జీవానగర్లో మనస్పర్థల కారణంగా భర్తను విడిచిపెట్టి ముత్తులక్ష్మి (36) నివసిస్తోంది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ముత్తులక్ష్మికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెకు ఇటీవల మగబిడ్డ జన్మించింది. ఆ బిడ్డను పోషించే స్థోమత లేకపోవడంతో విక్రయించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు జయపాల్ అనే బ్రోకర్, రాజేశ్వరి, సెల్వి అనే ఇద్దరు మహిళల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా ఈరోడ్కు చెందిన హసీనా అనే యువతికి రూ3.5లక్షలకు విక్రయించారు. ఈ నేపథ్యంలో రెండు రోజులకు ముందు ముత్తులక్ష్మి అస్వస్థతకు గురైంది. బిడ్డకు తల్లిపాలు పట్టించకపోవడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అదే సమయంలో బిడ్డ ఏమైందని వైద్యులు అడిగినప్పుడు ఆమె సక్రమంగా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి బిడ్డను కొనుగోలు చేసిన హసీనా, ముత్తులక్ష్మి సహా నలుగురు మహిళలను అరెస్టు చేశారు. జయపాల్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Updated Date - 2023-11-21T12:23:07+05:30 IST