రాజేష్కు డేవిడ్ షాక్
ABN, Publish Date - Feb 17 , 2024 | 01:05 AM
వైసీపీ అభ్యర్థి ఎదురుగానే సత్యవేడు టికెట్ కోరిన మాజీ జడ్పీటీసీ
సత్యవేడు/కేవీబీపురం, ఫిబ్రవరి 16: సత్యవేడు వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్కు కేవీబీపురం మాజీ జడ్పీటీసీ డేవిడ్ షాక్ ఇచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో రాజేష్ ఎదురుగానే స్థానికుడైన తనకు సత్యవేడు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సీనియర్ లీడర్, కేవీబీపురం మాజీ జడ్పీటీసీ డేవిడ్ సత్యవేడు వైసీపీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో తన మద్దతుదారులను వెంటబెట్టుకుని, శుక్రవారం తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డిని ఇంటి వద్ద కలిశారు. తనకు సత్యవేడు టికెట్ కేటాయించాలని కోరారు. తాను స్థానికుడని, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బంధువర్గం ఉందని, తొలినుంచీ పెద్దిరెడ్డి అనుచరుడిగా, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పుకొచ్చారు.అయితే సత్యవేడు అభ్యర్థిగా రాజేష్ పేరును అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించిందని, ఆయన గెలుపుకోసం అందరూ పనిచేయండని, పార్టీ అఽధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని డేవిడ్కు మిథున్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సన్నివేశమంతా సత్యవేడు వైసీపీ అభ్యర్థి రాజేష్ ముందర చోటు చేసుకోవడం విశేషం. అభ్యర్థి పేరు ప్రకటించాక కూడా టికెట్ ఇవ్వాలంటూ స్థానిక నాయకులు పట్టుబడుతుండడం.... అభ్యర్థి ముందరే టికెట్ కోరడం చర్చనీయాంశమైంది.ఈ పరిణామాలు సత్యవేడు వైసీపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Updated Date - Feb 17 , 2024 | 01:05 AM