ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చూడాలి
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:46 PM
జిల్లాలో ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు.
పార్వతీపురం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా జిల్లా కలెక్టర్ల్తో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయన క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారుల నియామకం, జిల్లా కంట్రోల్ రూమ్లు, సోషల్ మీడియా సెల్లు, ఫిర్యాదులు, నివేదికల నిర్వహణ వ్యవసల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ, పంపిణీ, ఓటర్ల నమోదు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీ సి.విష్ణుచరణ్, ఇన్చార్జి డీఆర్వో కేశవనాయుడు, పార్వతీపురం, పాలకొండ ఆర్డీవోలు హేమలత, రమణ, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అవగాహన
సాధారణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో దివ్యాంగులకు ఓటు వినియోగంపై ఈవీఎంల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వీప్ నోడల్ ఆఫీసర్ ఏ.రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు నమోదు, ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దానిపై విభిన్న ప్రతిభావంతులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఇప్పటికీ ఓటరుగా నమోదు చేసుకోకుండా ఉన్నవారు ఫారం-6, తప్పులను సరిచేసుకోవడానికి ఫారం-8ను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతిభావంతుల సంక్షేమశాఖ అధికారి కె.కవిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 11:46 PM