Minister: ఎయిమ్స్ కోసం ఒక్కొక్క ఇటుక రాయి సేకరణ..
ABN, Publish Date - Feb 01 , 2024 | 12:44 PM
మదురైలో ఎయిమ్స్ ఆసుపత్రి కోసం కేంద్రప్రభుత్వం ఒక్కో ఇటుకరాయి సేకరించే పనిలో పడిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఎద్దేవా చేశారు.
- మంత్రి ఎం.సుబ్రమణ్యం ఎద్దేవా
ప్యారీస్(చెన్నై): మదురైలో ఎయిమ్స్ ఆసుపత్రి కోసం కేంద్రప్రభుత్వం ఒక్కో ఇటుకరాయి సేకరించే పనిలో పడిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఎద్దేవా చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకొనేందుకే ఇలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. గిండిలో రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.30.5 కోట్లతో నిర్మించిన ప్రత్యేక శస్త్రచికిత్స కేంద్రాన్ని మంత్రి సుబ్రమణ్యం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కలైంజర్ సెంటినరీ ఉన్నత ప్రత్యేక ఆసుపత్రిలో సుమారు లక్షమందికి పైగా రోగులకు ఉన్నత శ్రేణి చికిత్సలు అందించేలా అన్నిరకాల వసతులు కల్పించామన్నారు. ఈ ఆసుపత్రిలో పేయింగ్ పేషంట్లకు 70 ప్రత్యేక గదులు అందుబాటులో ఉంటాయని, రూ.30.5 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలతో 10 ఉన్నత శ్రేణి శస్త్రచికిత్స గదులు, 50 పడకలు కలిగిన ఎమర్జెన్సీ చికిత్సా విభాగం తదితరాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పేయింగ్ వార్డులు 24 గంటలు పనిచేస్తాయని, వైద్యులు, నర్సులు షిఫ్టు విధానంలో విధుల్లో పాల్గొంటారని తెలిపారు. 70 ప్రత్యేక గదులకు అద్దెగా వసతులను బట్టి రోజుకు రూ.1,200 నుంచి డీలక్స్ గదులకు రూ.2,000, సూపర్ డీలక్స్ గదులకు రూ.3,000 చొప్పున అద్దె నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
Updated Date - Feb 01 , 2024 | 12:44 PM