విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది
ABN, Publish Date - Feb 11 , 2024 | 11:07 PM
కొత్తగడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జాండీస్ సోకి అస్వస్థతకు గురైన 300మంది విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడిందని వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు.
జాండీస్ సోకిన 300మందికి చికిత్సలు
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కొత్తగడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జాండీస్ సోకి అస్వస్థతకు గురైన 300మంది విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడిందని వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మూడు రోజులుగా వైద్యశాఖ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వారి ఆరోగ్యం పట్ల ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. 61 మంది చికిత్సల అనంతరం వారు తమ ఇళ్లకు వెళ్లినట్లు తెలిపారు. కుడుపునొప్పి సమస్యలు ఉన్న మరో 12మందికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. మిగతా విద్యార్థినులంతా కోలుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పట్ల మున్సిపల్, వైద్యశాఖల ఆధ్వర్యంలో తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినులందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
Updated Date - Feb 11 , 2024 | 11:07 PM