Manchiryāla- హైటెక్ సిటీలో సమస్యల తిష్ట
ABN, Publish Date - Mar 11 , 2024 | 09:51 PM
జిల్లాకేంద్రంలోని హైటెక్ సిటీకాలనీలో మౌలిక వసతులు లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పాటు చేసి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా సరైన డ్రైనేజీలు లేక మురుగునీరు వీధుల్లో పారుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
- ఫిర్యాదు చేస్తే కంటితుడుపు చర్యలు
- శాశ్వత పరిష్కారం చూపని మున్సిపల్ అధికారులు
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
జిల్లాకేంద్రంలోని హైటెక్ సిటీకాలనీలో మౌలిక వసతులు లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పాటు చేసి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా సరైన డ్రైనేజీలు లేక మురుగునీరు వీధుల్లో పారుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మంచిర్యాల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీకాలనీ పరిస్థితి పేరు గొప్ప... ఊరు దిబ్బ.. మాదిరిగా మారింది. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడ లేవంటే అతిశయోక్తి కాదు. హైటెక్ సిటీ పేరుతో వెంచర్ ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కక్కుర్తి కారణంగా డ్రైనేజీ పైప్లైన్లు తరుచుగా మొరాయిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం, ఎండకాలం తేడా లేకుండా నిత్యం ఇండ్ల చుట్టూ మురుగునీరు చేరుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
- మొరాయిస్తున్న పైప్లైన్లు..
హైటెక్ సిటీ పేస్-1 వెంచర్ను 2005లో ఏర్పాటు చేసిన నిర్వాహ కులు కాలనీకి అంతటికీ ఒకే ఒక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. కాలనీ నుంచి అర కిలో మీటరు దూరంలోని రాముని చెరువు సమీ పంలో సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేయగా, ఇళ్ల నుంచి సెప్టిక్ ట్యాంకు వరకు పైప్లైన్ల నిర్మాణం చేపట్టారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించిన వ్యాపారులు సిమెంటు పైపులు వేయడంతో అవి తరుచుగా లీకేజీ అవుతూ నీరంతా వీధుల్లో పారుతోంది. కాలనీలో సుమారు 1,200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాగా ఒకే ఒక సెప్టిక్ ట్యాంక్ కారణంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను సెప్టిక్ ట్యాంక్కు తరలించే పైప్లైన్లు సరిగ్గా లేకపోవ డంతో మధ్యలోనే మురుగు నీరు లీక్ అయి బయటకు ప్రవహిస్తోంది. వ్యర్థపదార్థాలతో కూడిన మురుగు నీరు కాలనీలోని ఇళ్ల చుట్టూ పారు తుండడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. సెప్టిక్ ట్యాంక్ వరకు వేసిన పైప్లైన్లు సరిగ్గా లేకపోవడంతో నీటి సరఫరా సక్రమంగా లేక ఈ పరిస్థితి తలెత్తుతోందని కాలనీవాసులు చెబుతున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా..
కాలనీలో డ్రైనేజీ నీరు సరఫరా సక్రమంగా లేని కారణంగా ఇళ్ల చుట్టూ చేరి, ఇబ్బందులకు గురి కావల్సి వస్తోందని పలుమార్లు స్థానికు లు మున్సిపల్ కార్యాలయంతో పాటు జిల్లా ఉన్నతాఽధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు అందినప్పుడల్లా మున్సిపల్ సిబ్బంది తాత్కాలికంగా చర్యలు చేపట్టి నీరు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారే కాని శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి యథాతథంగా ఉం టుందనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగు నీరు బయట ప్రవహిస్తుండడంతో తీవ్ర ఇబ్బం దులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనేజీ నీరు పూర్తిస్థాయిలో సెప్టిక్ ట్యాంక్కు చేరేలా శాశ్వత చర్యలు చేపడితేగానీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనబడడం లేదని ప్రజలు వాపోతున్నారు.
చేతులు దులుపుకున్న వ్యాపారులు..
హైటెక్ సిటీ వెంచర్ ఏర్పాటు చేసిన వ్యాపారులు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, నాలాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి ఏర్పాటు బాధ్యతలు వ్యాపారులపైనే ఉంటుంది. బడా వెంచర్ ఏర్పాటు చేసిన వ్యాపారులు ప్లాట్లు కొను గోలు చేసిన వారి నుంచి పెద్ద మొత్తంలోనే వసూలు చేశారు. అయిన ప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో మాత్రం కక్కుర్తి ప్రదర్శించడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాట్లు విక్రయించిన వ్యాపారులు చేతులు ఎత్తేయడంతో కాలనీలో సమస్యలు రాజ్యమేలుతు న్నాయి. వ్యాపారుల కక్కుర్తి కారణంగా నిర్వహణ అటకెక్కగా మున్సిపా లిటీ కంటి తుడుపు చర్యలు చేపడుతుండడంతో ఇబ్బందులు ఏర్పడు తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు స్పందించి తమ సమస్యను శాశ్వతంగా పరి ష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Mar 11 , 2024 | 09:51 PM