Republic Day 2023: భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఈసారి ఎవరంటే?

ABN , First Publish Date - 2022-11-27T20:55:44+05:30 IST

భారత గణతంత్ర వేడులకు ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి (Abdel Fattah al-Sisi) ముఖ్య అతిథిగా రాబోతున్నారు

Republic Day 2023: భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఈసారి ఎవరంటే?
Egypt President

న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడులకు ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి (Abdel Fattah al-Sisi) ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) లాంఛనంగా పంపిన ఆహ్వానాన్ని అక్టోబరు 16న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అల్-సిసికి అందజేశారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడిని (Egypt President) ఆహ్వానించడం వెనక ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. రెండు దేశాలు ఈ ఏడాది దౌత్య సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దీంతో సిసి భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అధ్యక్షుడు హాజరుకానుండడం తొలిసారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. వచ్చే ఏడాది భారత్ సారథ్యంలో జరగనున్న జి-20 సదస్సుకు ‘అతిథి దేశం’ (గెస్ట్ కంట్రీ)గా పాల్గొనాల్సిందిగా ఈజిప్ట్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. భారత్-ఈజిప్ట్ నాగరికత, లోతుగా పాతుకుపోయిన వ్యక్తుల మధ్య సంబంధాల ఆధారంగా ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా, 1950 నుంచి గణతంత్ర వేడులకు విదేశీ నేతలను భారత్ ఆహ్వానిస్తోంది. ఆ ఏడాది వేడుకలకు అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, 1952, 1953, 1966 రిపబ్లిక్ వేడుకలు మాత్రం విదేశీ అతిథులు లేకుండానే జరిగాయి. 2021 గణతంత్ర వేడుకలకు అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించినా కరోనా మహమ్మారి కారణంగా హాజరు కాలేకపోయారు.

Updated Date - 2022-11-27T20:55:46+05:30 IST