బందరు, గుడివాడలో రోడ్లు జలమయం
ABN , First Publish Date - 2023-05-31T02:27:08+05:30 IST
: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మచిలీపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుడివాడ బస్టాండ్ జలమయం కావడంతో మాజీ ఎమ్మెల్యే రావి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో గుడివాడలో అభివృద్ధి శూన్యమన్నారు. బుధ, గురువారాల్లో కోస్తాతీరం వెంబడి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో వర్షాలు వ్యవసాయ పనులకు ఉపయోగంగా ఉంటాయని, వేసవి దుక్కులు దున్నేందుకు భూమి అనుకూలంగా మారుతుందని రైతులు పేర్కొన్నారు.
రెండు గేదెలు మృత్యువాత
అవనిగడ్డ టౌన్ : అవనిగడ్డలోని తొమ్మిదో వార్డులో విద్యుత్ వైర్లు తెగిపడటంతో కొత్తఎడ్లంకకు చెందిన రేపల్లె దుర్గా ప్రసాద్ అలియాస్ చినబాబుకు చెందిన ఒక పాడి గేదె, ఒక చూడి గేదె మృత్యువాత పడ్డాయి. గేదెలను పొలం తోలుకు వెళ్లే సమయంలో వైర్లు తెగిపడ్డాయి. దీంతో గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. వీటి ఖరీదు సుమారు రూ.లక్షా 30 వేలు ఉంటుందని అంచనా. నాగాయలంక : మంగళవారం నాగాయలంకలో గంటసేపు వర్షం కురిసింది. రహదారులపై వర్షపు నీరు చేరింది. ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్న ప్రజలు వర్షం కురవడంతో సేద తీరారు.







