scorecardresearch

మత్స్యగుండం.. అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2023-08-05T00:29:57+05:30 IST

పర్యాటక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన మత్స్యగుండం పర్యాటకంగా కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఎంతో సుందరంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం అధ్వానంగా దర్శనమిస్తున్నది. పర్యాటకానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచక భక్తులు, సందర్శకులను ఆకర్షించలేని దుస్థితి కొనసాగుతుంది. కొన్ని ఏళ్లుగా మత్స్యగుండంపై పాలకులు కన్నెత్తి చూడలేదు. అలాగే 2003, 2016 సంవత్సరాల్లో మత్స్యగుండం అభివృద్ధికి చేపట్టిన పనులు సైతం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా ఉన్నాయి.

మత్స్యగుండం.. అభివృద్ధి శూన్యం
కనీస అభివృద్ధికి నోచుకోని మత్స్యగుండం

- పర్యాటకాభివృద్ధికి నోచుకోని పుణ్యక్షేత్రం

- భక్తులు, పర్యాటకులను ఆకర్షించలేని పరిస్థితి

- గత ప్రభుత్వ హయాంలో మత్స్యకన్య, త్రిముఖ శివుడు ప్రతిమలు, రెస్టారెంట్‌ భవనం, వ్యూపాయింట్‌ నిర్మాణం

- ప్రస్తుతం అభివృద్ధిపై దృష్టి పెట్టని వైసీపీ సర్కారు

(ఆంధ్ర జ్యోతి- పాడేరు/హుకుంపేట)

పర్యాటక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన మత్స్యగుండం పర్యాటకంగా కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఎంతో సుందరంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం అధ్వానంగా దర్శనమిస్తున్నది. పర్యాటకానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచక భక్తులు, సందర్శకులను ఆకర్షించలేని దుస్థితి కొనసాగుతుంది. కొన్ని ఏళ్లుగా మత్స్యగుండంపై పాలకులు కన్నెత్తి చూడలేదు. అలాగే 2003, 2016 సంవత్సరాల్లో మత్స్యగుండం అభివృద్ధికి చేపట్టిన పనులు సైతం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా ఉన్నాయి.

మత్స్యగుండం 2002 సంవత్సరం వరకు స్థానికులకు మినహా ఇతర ప్రాంతాలకు అంతగా తెలియని పరిస్థితి. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర నేపథ్యంలో మత్స్యలింగేశ్వరుడ్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. క్రమంగా ఆ తరువాత నుంచి మత్స్యగుండంపై ముమ్మర ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాలకు నుంచి భక్తులు, పర్యాటకులు వచ్చేవారు. దీంతో టూరిజం పరంగా మత్స్యగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని 2003లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.కోటి వ్యయంతో మత్స్యకన్య, త్రిముఖ శివుడు ప్రతిమలు, రెస్టారెంట్‌ భవనం, వ్యూపాయింట్‌, సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల గులాబీలతో పార్కును అభివృద్ధి చేశారు. కానీ ఆ తరువాత సైతం అధికారులు దాని నిర్వహణ, బాగోగులు పట్టించుకోలేదు. దీంతో కొన్నాళ్లకే మత్స్యగుండం అధ్వానంగా మారింది. ఆ తరువాత పుష్కర కాలానికి అంటే 2016లో వుడా (విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ఆధ్వర్యంలో మళ్లీ మత్స్యగుండం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. సుమారుగా రూ.48 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ముఖ్యంగా మత్స్యగుండం నిర్వహణపై అటు దేవదాయ శాఖగాని, ఇటు పర్యాటకశాఖ గాని దృష్టిసారించిన దాఖలాలు లేవు. దీంతో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా అక్కరకు రాని దుస్థితి కొనసాగుతున్నది.

పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో బాగు

ప్రకృతి అందాలకు నిలయమైన గిరిజన ప్రాంతంలో పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని స్థానికులు, పర్యాటకులు అంటున్నారు. వాస్తవానికి మత్స్యగుండం వంటి ప్రాంతంలో అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా భక్తులకు, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రధానంగా భక్తిపరంగా జరిగే కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనువుగా మందిరాలు, భక్తులు వంటలు, బస చేసేందుకు అనువుగా ఆశ్రమం తరహా నిర్మాణాలు చేపడితే, మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందుతుందని పలువురు అంటున్నారు. అలాగే పర్యాటకులను ఆకట్టుకునేలా విజ్ఞాన, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు, సువిశాలమైన ప్రదేశంలో ఉన్న పార్కును అభివృద్ధి చేయడం, పర్యాటకులు బస చేసేందుకు అనువుగా చిన్న చిన్న కాటేజీలు, బోజన సదుపాయానికి రెస్టారెంట్‌లు అందుబాటులోకి తీసుకువస్తే.... అరకులోయ నుంచి లంబసింగి వెళ్లే పర్యాటకులు పాడేరు ప్రాంతాన్ని సందర్శించి మత్స్యగుండంలో బస చేసేందుకు బాగుంటుందని సందర్శకులు అంటున్నారు. ప్రస్తుతం పర్యాటకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు ప్రత్యేక గుర్తింపుతోపాటు, ఏజెన్సీకి మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించే అవకాశాలున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం మత్స్యగుండం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-05T00:29:57+05:30 IST