సచివాలయ వ్యవస్థలో మార్పులపై చర్చించాలి
ABN, Publish Date - Aug 11 , 2024 | 11:40 PM
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించి చర్చించిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ సూచించారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 11: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించి చర్చించిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ సూచించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రూపకల్పన చేసినప్పటికీ ఉద్యోగుల విధివిధానాలు, జాబ్ చార్ట్, ఉద్యోగోన్నతి, తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. సచివాలయ ఉద్యోగులపై కొందరు అధికారులు వివక్ష చూపుతూ సంబంధంలేని పనులు చేయిస్తున్నారన్నారు. పలు రకాల వింత నిబంధనలు విధించి షోకాజ్లు, మెమోల పేరుతో ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గ్రామ సచివాలయాల రేషనలైజేషన, క్లస్టర్ విధానం అమలు, ఉద్యోగుల రేషనలైజేషన తదితర ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం తెరపైకి తేవడంతో ఏం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారన్నారు. ఏ ఉద్యోగులను ఎక్కడ సర్దుబాటు చేస్తారో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘాల నాయకులతో ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, కొత్త నిర్ణయాలపై సమాలోచనలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగోన్నతి కల్పించడంతోపాటు మాతృశాఖలకు అనుసంధానం చేయాలన్నారు. రెండు సంవత్సరాల ప్రొబేషన కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన భవిష్యత, హక్కుల సాధన కోసం పోరాడేందుకు సచివాలయ ఉద్యోగులు అందరూ ఏకమై కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. శివశంకర్, హనుమంతు, నరసింహ, మహేష్, రామాంజనేయులు, హనుమంతరెడ్డి, భగీరథరెడ్డి, ఈశ్వర్, ముత్యాలు, మణిదీప్, ధనుంజయ పాల్గొన్నారు.
Updated Date - Aug 11 , 2024 | 11:40 PM