PD POST : పోటాపోటీ..!
ABN, Publish Date - Jul 07 , 2024 | 11:44 PM
డీఆర్డీఏ, డ్వామా పీడీ పోస్టుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని పీడీలుగా నియమించారు. సుమారు ఐదేళ్లు ఆ ఇద్దరే పీడీలుగా కాలం గడిపేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిద్దరూ సొంతశాఖలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీఆర్డీఏ పీడీ ఇప్పటికే 15రోజులు సెలవులో వెళ్లారు. డ్వామా పీడీ తన సొంత శాఖ జైళ్ల శాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు ఇద్దరు పీడీలు అంటకాగి అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇక ఇద్దరు పీడీలు ...
డ్వామా, డీఆర్డీఏ పీడీ పోస్టుల కోసం ఆశావహుల యత్నం
రేసులో పలువురు డీఎల్డీఓలు
అధికార పార్టీ నేతల ప్రసన్నం కోసం పాట్లు
అనంతపురం క్లాక్టవర్, జులై 7: డీఆర్డీఏ, డ్వామా పీడీ పోస్టుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని పీడీలుగా నియమించారు. సుమారు ఐదేళ్లు ఆ ఇద్దరే పీడీలుగా కాలం గడిపేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిద్దరూ సొంతశాఖలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీఆర్డీఏ పీడీ ఇప్పటికే 15రోజులు సెలవులో వెళ్లారు. డ్వామా పీడీ తన సొంత శాఖ జైళ్ల శాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు ఇద్దరు పీడీలు అంటకాగి అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇక ఇద్దరు పీడీలు వెళ్లిపోతే...రెండు పోస్టులు ఖాళీ అవుతాయి. ఈ క్రమంలో ఆశా వహులు రెండు పోస్టుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో టీడీపీ అధికారంలో
ఉన్నప్పుడు పీడీ పోస్టుల కోసం ప్రయత్నించిన వారు ఈ దఫా ఎలాగైనా సాధించుకోవాలనే లక్ష్యంతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో డీఆర్డీఏ, డ్వామా రెండూ శాఖలు కీలకమే. అలాంటి ప్రాధాన్యం గల శాఖల్లో పాగా వేసేందుకు ఎంపీడీఓలు, డీఎల్డీఓలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సముచితస్థానంలో పనిచేసిన వారు సైతం కూటమి ప్రభుత్వంలో మెరుగైన స్థానం సాధించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలోని కీలక నేతలను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు అనేకరూపాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. నేతలను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేయడం, అభినందనలు తెలుపడంతో మొదలెట్టి...తమకు, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని సుతిమెత్తని మాటలతో ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర పోటీ
ఇదివరకు ఎంపీడీఓలే డ్వామా, డీఆర్డీఏ పీడీ పోస్టులకు ఎక్కువగా పోటీ పడేవారు. అయితే ఎంపీడీఓలకు డీఎల్డీఓలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వీరిలో గతంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో పనిచేసి, ప్రస్తుతం జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా పనిచేస్తున్న డీఎల్డీఓ డ్వామా పీడీగా రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఉండటం ఇతడికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఆయన డ్వామాకు రావడంపై సిబ్బంది, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన మరో డీఎల్డీఓ డ్వామాకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనంతపురం ఎంపీడీఓగా పనిచేసిన డీఎల్డీఓ, జిల్లా సహకారశాఖలో పనిచేసిన ఓ అధికారి డ్వామా పీడీగా రావాలని ఆయా స్థాయిల్లో అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే డ్వామా అదనపు పీడీగా పనిచేస్తున్న మరో డీఎల్డీఓ రెగ్యులర్ పీడీగా తెచ్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డ్వామాలో కీలక పోస్టులో ఉన్న మరో డీఎల్డీఓ కూడా డ్వామా పీడీగా నియామకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేసిన డీఎల్డీఓ డ్వామా కాకపోతే డీఆర్డీఏ పీడీగా రావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీఆర్డీఏ ఇనచార్జి పీడీగా ఉన్న ఏపీడీ కూడా రెగ్యులర్ పీడీగా చేసుకోవాలని అధికారపార్టీ నేతలను కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా డ్వామా, డీఆర్డీఏ పీడీలుగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ ఆయా శాఖల్లో కొనసాగుతోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jul 07 , 2024 | 11:44 PM