Welfare hostels : మూలుగుతున్న పాతసామాను
ABN, Publish Date - Aug 03 , 2024 | 12:02 AM
సంక్షేమ వసతి గృహాలకు అసలే గదుల కొరత వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న గదులను కూడా పాత సామాను భద్రపరచడానికి వినియోగిస్తుండడంతో విద్యార్థులు ఇరుకు గదుల్లో మరింత ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు వసతి గృహాల గదుల్లో కాలం చెల్లిన ట్రంకు పెట్టెలు, వంటసామగ్రి తదితర వస్తువులతో నింపేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా తుప్పుపట్టిన, విరిగిపోయిన ట్రంకు పెట్టెలు, వంట సామగ్రి పేరుకుపోవడంతో వాటిని ఎక్కడుంచాలో తెలియక వసతి గృహాల్లోని విద్యార్థుల గదుల్లో డంప్ చేశారు. దీంతో విద్యార్థులకు గదుల కొరత ఏర్పడుతోంది. వీటిని ..
ట్రంకు పెట్టెలు, వంట సామగ్రికి తుప్పు
గదుల కొరతతో విద్యార్థుల అవస్థలు
వసతి గృహాలను పట్టించుకోని అధికారులు
అనంతపురం ప్రెస్క్లబ్, ఆగస్టు 2: సంక్షేమ వసతి గృహాలకు అసలే గదుల కొరత వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న గదులను కూడా పాత సామాను భద్రపరచడానికి వినియోగిస్తుండడంతో విద్యార్థులు ఇరుకు గదుల్లో మరింత ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు వసతి గృహాల గదుల్లో కాలం చెల్లిన ట్రంకు పెట్టెలు, వంటసామగ్రి తదితర వస్తువులతో నింపేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా తుప్పుపట్టిన, విరిగిపోయిన ట్రంకు పెట్టెలు, వంట సామగ్రి పేరుకుపోవడంతో వాటిని ఎక్కడుంచాలో తెలియక వసతి గృహాల్లోని విద్యార్థుల గదుల్లో డంప్ చేశారు. దీంతో విద్యార్థులకు గదుల కొరత ఏర్పడుతోంది. వీటిని ఎప్పటికప్పుడు తరలించాల్సిన ఆయా సంక్షేమశాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సాధారణంగా ఈ వేస్టేజీలను జేసీ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి విక్రయిస్తారు. అనంతరం వచ్చిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి జమచేస్తారు. జేసీ దృష్టికి ఏ ఏ వసతి గృహాల్లో ఎంత వేస్టేజీ ఉందన్న నివేదికలు పంపడంలో సంక్షేమ శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పదేళ్ల క్రితం టెండర్లు నిర్వహించి పాత సామాగ్రిని తరలించినట్లు పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. అప్పటి నుంచి ఎలాంటి టెండర్లు నిర్వహించకపోవడంతో వసతి గృహాల్లోని గదుల్లో
భద్రపరచాల్సి వస్తోందని... ఫలితంగా విద్యార్థులు ఉండటానికి గదుల కొరత ఏర్పడుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కలుగుజేసుకొని ఆ పాత సామాగ్రిని విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
కుప్పలుగా..
జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కాలంచెల్లిన ట్రంకుపెట్టెలు, వంటసామగ్రి తదితర వస్తువులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. వాటన్నింటిని బహిరంగ మార్కెట్ ధర ప్రకారం అమ్మితే ఒక్కో వసతి గృహంలోని సామగ్రి రూ. లక్షకుపైగా విలువ ఉంటుందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని వేస్టేజీని అమ్మితే దాదాపు రూ. కోటి వరకూ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం ఏ సంవత్సరం ఎంత వేస్టేజీ బయటపడుతుందోనన్న నివేదికలు సైతం అధికారుల వద్ద లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వార్డెన్ల నుంచి నివేదికలు తెప్పించుకొని వాటిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు అందజేయాల్సిన సంక్షేమశాఖల అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది.
గదుల కొరత..
వసతి గృహాల్లో వేస్టేజీ పేరుకుపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. బయట ప్రాంతాల్లో వేస్తే వర్షాలు, దుమ్ము, దూళికి తప్పుపట్టి పాడైపోతాయోనని పలువురు వార్డెన్లు వసతిగృహాల్లోని గదు ల్లో భద్రపరుస్తున్నారు. కొన్నిచోట్ల రెండు మూడు గదుల్లో వాటిని భద్రపరచడంతో విద్యార్థులకు గదుల కొరత ఏర్పడుతోంది. అసలే ఉన్న గదులు పెచ్చులూడి ఇబ్బందులు విద్యార్థులకు ఈ వేస్టేజీ డంప్తో గదుల సమస్య తీవ్రమవుతోంది. ఏడాదికేడాదికి వేస్టేజీ పేరుకుపోతుండటంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
నిబంధనల ప్రకారం చేస్తాం..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వసతి గృహాల్లోని కాలంచెల్లిన ట్రంకుపెట్టెలు తదితర వస్తువులను విక్రయిస్తాం. ఈ విషయంపై రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతాం.
-కుష్బూ కొఠారీ, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల డీడీ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 03 , 2024 | 12:02 AM