RALY: కలిసికట్టుగా డెంగీని అరికడదాం
ABN, Publish Date - May 16 , 2024 | 11:53 PM
డెంగీని అందరం కలిసికట్టుగా అరికడదామని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సురేశనాయక్, మలేరియా సబ్యూనిట్ అధికారి జయరాం నాయక్ పిలుపునిచ్చారు.
వైద్యాధికారుల పిలుపు
డెంగీ నివారణపై అవగాహన ర్యాలీ
ధర్మవరం, మే 16: డెంగీని అందరం కలిసికట్టుగా అరికడదామని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సురేశనాయక్, మలేరియా సబ్యూనిట్ అధికారి జయరాం నాయక్ పిలుపునిచ్చారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం వారు ఆస్పత్రి నుంచి వైద్యసిబ్బంది, అంగనవాడీ, ఆశాకార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేశనాయక్, జయరాం నాయక్ మాట్లాడుతూ.. డెంగీ ఆర్థోవైరస్ వల్ల వస్తుందన్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి ఏడీఎస్ ఈజిప్టై దోమల ద్వారా సక్రమిస్తుందన్నారు. ఈ దోమలు పగటిపూట కుడతాయన్నారు. వీటి నివారణకు ప్రజలు ఇంటి పరిసరాలలో నీటిని నిల్వఉంచరాదన్నారు. రాత్రి సమయాల్లో ఇళ్ల ముంగిట వేపాకు పొగ వేసుకోవాలని , పడుకునేటప్పుడు దోమ తెరలు వాడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు పుష్పలత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: డెంగీ నివారణపై మండలకేంద్రంలో గురువారం వైద్యాధికారి భానుప్రకా్షనాయక్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ డెంగీ నివారణకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. వర్షపునీరు, ఇళ్లలోంచి వచ్చే నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. అలాగే టైర్లు, కొబ్బరి చిప్పలు, పాత డబ్బాలు, కుండలు తదితర వాటిలో కూడా నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. వాటిల్లో నీరు ఉంటే దోమలు లార్వాలను వృద్ధి చేస్తాయన్నారు. తద్వారా డెంగీ వ్యాపిస్తుందన్నారు. కనుక శుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి డెంగీ నివారణకు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు విజయకుమారి, మురళి, సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 16 , 2024 | 11:53 PM