LAND : ఖాళీలు.. కబ్జాలు..!
ABN, Publish Date - May 28 , 2024 | 11:45 PM
నాలుగో తేదీ తరువాత అధికారం ఉంటుందో లేదో..! దీపం ఉండగానే ‘ఇంటి స్థలాలను అమ్మేసుకోవాలి’ అనుకున్నట్లున్నారు అధికార పార్టీ నాయకులు. బుక్కరాయసముద్రంలో జగనన్న కాలనీ ఖాళీ స్థలాలను కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. కొందరైతే ఏకంగా ‘ప్లాట్ ఫర్ సేల్’ అని బోర్డు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. తక్కవ ధరకే ఇంటి స్థలం వస్తుందనుకుని అమాయకులు వారి వలలో పడుతున్నారు. డబ్బులు చెల్లించి పునాదులు వేసుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మీన మేషాలు లెక్కబెడుతున్నారు. ...
జగనన్న కాలనీల్లో వ్యాపారం
బినామీల పేరిట భారీగా పట్టాలు
నిలువునా అమ్మేస్తున్న వైసీపీ నాయకులు
బుక్కరాయసముద్రం, మే 28: నాలుగో తేదీ తరువాత అధికారం ఉంటుందో లేదో..! దీపం ఉండగానే ‘ఇంటి స్థలాలను అమ్మేసుకోవాలి’ అనుకున్నట్లున్నారు అధికార పార్టీ నాయకులు. బుక్కరాయసముద్రంలో జగనన్న కాలనీ ఖాళీ స్థలాలను కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. కొందరైతే ఏకంగా ‘ప్లాట్ ఫర్ సేల్’ అని బోర్డు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. తక్కవ ధరకే ఇంటి స్థలం వస్తుందనుకుని అమాయకులు వారి వలలో పడుతున్నారు. డబ్బులు చెల్లించి పునాదులు వేసుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మీన మేషాలు లెక్కబెడుతున్నారు.
ఖాళీ ఉంటే కబ్జానే..
బుక్కరాయసముద్రం జగనన్న కాలనీలో ఎనిమిది లే ఔట్లు వేశారు. దీనికోసం ఎకరం రూ.20 లక్షల ప్రకారం 55 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.కోట్లు ఖర్చు చేసింది. కానీ పట్టాలను కేవలం వైసీపీ వర్గీయులకే ఇచ్చారు. మొత్తం ఎనిమిది లేఔట్లలో 2,300 మందికిపైగా లబ్ధిదారులను గుర్తించారు. ఆ తరువాత కొందరిని అనర్హత పేరిట తొలిగించారు. అలా మిగిలిపోయిన స్థలాలను అధికార పార్టీ నాయకులు
ఆక్రమించి అమ్మేస్తున్నారు. ఖాళీ స్థలం ఎక్కడ ఉందో రెవెన్యూ రికార్డులలో చూడటం.. ఎవరికీ పట్టా ఇవ్వకుంటే కబ్జా చేయడం.. అమ్మేయడం పరిపాటిగా మారింది. ఒక్కో ప్లాట్కు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్ష వసూలు చేస్తున్నారు.
బినామీల పేరిట 50 పట్టాలు..
బుక్కరాయముద్రం ఆరో లే ఔట్లో 912 పాట్లు వేశారు. ఇందులో చాలా ఖాళీలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ రాకముందు ఇక్కడ పనిచేసి, బదిలీపై వెళ్లిన ఓ రెవెన్యూ అధికారి.. అధికార పార్టీ నాయకుడి బినామీల పేరిట 50 ఇంటి పట్టాలు ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం. ఆర్ఐ ప్రమేయం లేకుండానే.. వీఆర్ఏ, అ ఉన్నతాధికారి నేరుగా పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. వాటిని తన వద్ద పెట్టుకున్న వైసీపీ నాయకుడు.. ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని తెలిసింది. ఒక్కరికే అన్ని ఇంటి పట్టాలు ఇవ్వడంతో అధికార పార్టీలోని మిగిలిన నాయకులు గుర్రుగా ఉన్నారు. అక్రమంగా పట్టాలు ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విచారించి తొలగిస్తాం..
జగనన్న లేఔట్లో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. పట్టాలు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడితే తొలగిస్తాం. ప్రభుత్వ ఇంటి స్థలాలను ఎవరూ కొనుగోలు చేయవద్దు. ఎక్కడైనా కబ్జాలకు పాల్పడితే ప్రజలు మాకు సమాచారం ఇవ్వాలి. విచారించి చర్యలు తీసుకుంటాం
- హనుమంతునాయక్, తహసీల్దారు
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - May 28 , 2024 | 11:45 PM