అక్రమాల అధికారికి అందలం?!
ABN, Publish Date - Jul 27 , 2024 | 03:04 AM
వైసీపీ నాయకులతో అంటకాగుతూ పరిశ్రమల శాఖలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఓ అధికారికి కూటమి ప్రభుత్వం మరో వరమాల వేయనుంది.
వైసీపీ నేతలతో అంటకాగిన ప్రతా్పరెడ్డికి మరో కీలక పదవి
డిప్యుటేషన్ పొడిగించి పదోన్నతి కల్పించేందుకు ప్రయత్నాలు
వైసీపీకి చేసిన సేవలకేనా అని పరిశ్రమల శాఖలో విస్మయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైసీపీ నాయకులతో అంటకాగుతూ పరిశ్రమల శాఖలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఓ అధికారికి కూటమి ప్రభుత్వం మరో వరమాల వేయనుంది. సదరు అధికారి డిప్యుటేషన్ను పొడిగించడంతోపాటు పదోన్నతి కూడా కల్పించేందుకు ఫైల్ కదులుతున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి రెండు, మూడు కీలక స్థానాల్లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కొత్త ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీకి చేసిన సేవలకు గుర్తింపునిస్తూ.. ఆ అధికారికి ఓ మంత్రి మద్దతుగా నిలిచి పని పూర్తిచేస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న పి.ప్రతా్పరెడ్డి రాష్ట్ర విభజనకు ముందునుంచే వైసీపీ నేతలతో టచ్లో ఉండేవారు. 2019 ఎన్నికల్లో ఆయన ఏపీలోనే తిష్ఠ వేసుకుని ఆ పార్టీ విజయానికి కృషి చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ సేవలను గుర్తించిన వైసీపీ నాయకులు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రతా్పరెడ్డిని డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం ఆయన్ను ఏపీఐఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఏపీఐఐసీ 8వ అంతస్థులో అద్దాలతో ఇంటీరియర్ డెకరేషన్ చేయించి ఏకంగా రూ.12కోట్ల బిల్లులు డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయనను తొలగించాలంటూ అప్పట్లో సంస్థ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇది వివాదంగా మారడంతో అప్పటి ఏపీఐఐసీ ఎండీ ఒక మెమో జారీచేసి ప్రతా్పరెడ్డిని విధుల నుంచి తొలగించారు. తర్వాత ప్రభుత్వ పెద్దల వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని చక్రం తిప్పడంతో ప్రతా్పరెడ్డిని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(ఏపీటీపీసీ) వైస్ చైర్మన్, ఎండీగా నియమించారు.
ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి ఏపీటీపీసీలో రూ.40 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా.. వాటిని ఇష్టానుసారం దుర్వినియోగం చేసేశారని, ఇప్పుడు ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితికి తీసుకువచ్చాని చెబుతున్నారు. ఇదికాకుండా రామాయపట్నం పోర్టు డెవల్పమెంట్ కార్పొరేషన్ సీఈవోగా ప్రతా్పరెడ్డినే వైసీపీ ప్రభుత్వం నియమించింది. అక్కడా ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రతా్పరెడ్డి తెరవెనుక విశేషంగా కృషి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ప్రతా్పరెడ్డి పని అయిపోయిందని అందరూ భావించారు. ఆయన డిప్యుటేషన్ పీరియడ్ కూడా పూర్తికావడంతో తిరిగి తెలంగాణకు వెళ్లిపోతారని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా కొత్త ప్రభుత్వం ఆయన్ను ఇంకా అందలమెక్కించింది. ఇప్పటికే ఏపీటీపీసీ ఎండీగా, రామాయపట్నం పోర్టు డెవల్పమెంట్ కార్పొరేషన్ సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను.. ఇటీవలే మచిలీపట్నం పోర్టు డైరెక్టర్గా కూడా నియమించింది. ఈ స్థానంలో ఉన్న దయాసాగర్ను బదిలీ చేసి మరీ ప్రతా్పరెడ్డిని నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతా్పరెడ్డి డిప్యుటేషన్పై వచ్చి ఐదేళ్లు పూర్తయింది. దీంతో ఆయనను తెలంగాణకు పంపించాలని పరిశ్రమల శాఖ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఆయన డిప్యుటేషన్ను మరో రెండేళ్లపాటు పొడిగించి ఇక్కడే కొనసాగించేందుకు అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి, కొంతమంది నాయకులు తెర వెనుక పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు ఎక్స్టెన్షన్ రావచ్చని భావిస్తున్నారు.
Updated Date - Jul 27 , 2024 | 07:48 AM