నేడు సుప్రీం సీజే తిరుపతి రాక
ABN, Publish Date - Mar 26 , 2024 | 02:01 AM
భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ వై చంద్రచూడ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతి రానున్నారు.
ఎస్వీయూలో వర్క్షాప్కు హాజరు
తిరుపతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ వై చంద్రచూడ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతి రానున్నారు. కలెక్టరేట్కు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 9 గంటలకు బెంగళూరు నుంచీ విమానంలో బయల్దేరి 10 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వీయూలో లా కోర్సులు ప్రారంభించి పదేళ్ళవుతున్న సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ లీగల్ ఎడ్యుకేషన్ (న్యాయవిద్యలో కృత్రిమ మేధ) అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్కుషాపును ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు మహాలక్ష్మీ పావని, జేబీ గుప్తా తదితరులు కూడా హాజరు కానున్నారు.రాత్రి 8 గంటలకు బయల్దేరి తిరుమల చేరుకునే సీజే రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం వేకువ జామున కుటుంబంతో శ్రీవారిని దర్శించుకుని ఉదయం 9 గంటలకు బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. 11.30 గంటలకు విమానంలో బయల్దేరి హైదరాబాదు వెళ్ళనున్నారు.
Updated Date - Mar 26 , 2024 | 02:01 AM