దొంగ నోట్లతో పట్టుబడిన పుంగనూరు యువకులు
ABN, Publish Date - Apr 13 , 2024 | 01:44 AM
పుంగనూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు దొంగ నోట్లతో తెలంగాణలో పట్టుబడటం.. వీరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది
చిత్తూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు దొంగ నోట్లతో తెలంగాణలో పట్టుబడటం.. వీరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది. పుంగనూరు మండలం గుడిసిబండ గ్రామానికి చెందిన గంగరాజు (24), చిన్నకొండచెర్ల గ్రామానికి చెందిన అభినందన్రెడ్డి(22)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన రవికి బెంగళూరులో నకిలీ కరెన్సీని గంగరాజు విక్రయించే ప్రయత్నం చేశాడు. రవితో డీల్ కుదరక అక్కడి నుంచి తిరిగి హైదరాబాదుకు వచ్చేశాడు. హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్లో నకిలీ నోట్ల చెలామణికి ఇంకో డీల్ మాట్లాడాడు. ఈ డీల్ జరుగుతున్న సమయంలోనే ఎస్వోటీ పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఈ ఫేక్ కరెన్సీని ముద్రిస్తున్నట్లు వెల్లడైంది. గంగరాజు, అభినందన్రెడ్డి వద్ద పోలీసులు 500 నోట్లున్న 10 కట్టలను గుర్తించారు. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.
Updated Date - Apr 13 , 2024 | 01:44 AM