అక్రమార్కులపై ఎస్పీ కొరడా
ABN, Publish Date - Aug 19 , 2024 | 12:11 AM
అక్రమార్కులపై ఎస్పీ సుబ్బరాయుడు కొరడా ఝుళిపించారు. ఓ హెడ్ కానిస్టేబుల్తోపాటు ఇద్దరు హోంగార్డులను ఆదివారం సస్పెండ్ చేశారు. ఓ సీఐకి చార్జి మెమో ఇచ్చారు.
చంద్రగిరి సీఐకి చార్జి మెమో
అనధికారిక జరిమానా వసూలు చేస్తున్న హోంగార్డుపైనా వేటు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 18: అక్రమార్కులపై ఎస్పీ సుబ్బరాయుడు కొరడా ఝుళిపించారు. ఓ హెడ్ కానిస్టేబుల్తోపాటు ఇద్దరు హోంగార్డులను ఆదివారం సస్పెండ్ చేశారు. ఓ సీఐకి చార్జి మెమో ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లె, మండపంపల్లె గ్రామాల సమీపం నుంచి మల్లయ్యపల్లె మీదుగా గ్రావెల్ తవ్వి టిప్పర్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ అధికారుల కళ్లు కప్పి కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ అవినీతి తంతుపై చంద్రగిరి సీఐ రామయ్యకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా హెడ్కానిస్టేబుల్ ఎస్.బసవయ్య, హోంగార్డు సుధాకర్లను వెంటనే గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవాలని ఆదేశించారు. సీఐ ఆదేశాలను వారు పట్టించుకోలేదు. మరోవైపు ఈ అంశంపై స్థానికులు కొందరు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఆయన గ్రావెల్ అక్రమంగా రవాణా చేస్తున్నవారికి తమ సిబ్బంది వంత పాడినట్లు నిరూపణ అయింది. దాంతో చంద్రగిరి సీఐ రామయ్యకు చార్జి మెమో జారీ చేశారు. రక్షక్ మొబైల్ హెడ్కానిస్టేబుల్ బసవయ్య, హోంగార్డు సుధాకర్ను సస్పెండ్ చేశారు. శాఖా పరమైన విచారణకూ ఆదేశించారు. అలాగే తిరుపతి ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై అనధికారికంగా జరిమానా విధిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు అందింది. విచారణలో అక్రమ వసూళ్లు చేస్తున్నది నిజమని తేలడంతో అతడినీ సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలోని ప్రతి ఒక్కరూ ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఏ స్థాయి అధికారైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Updated Date - Aug 19 , 2024 | 12:11 AM