‘కూటమి’ అభ్యర్థుల గెలుపే లక్ష్యం
ABN, Publish Date - Apr 05 , 2024 | 01:00 AM
జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యమని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్ చెప్పారు.
అట్టహాసంగా చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా సీఆర్ రాజన్ ప్రమాణం
చిత్తూరు సిటీ, ఏప్రిల్ 4: జిల్లాలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యమని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్ చెప్పారు. గురువారం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం దొడ్డిపల్లెలోని కన్నికలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా కట్టమంచి, ప్రకాశం హైరోడ్డు, పీసీఆర్ సర్కిల్, కొత్తబస్టాండు, మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారరు.. పీసీఆర్ సర్కిల్ వద్ద పార్టీ అభిమానులు క్రేన్ ద్వారా సీఆర్ రాజన్కు గజమాల వేశారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఆర్ రాజన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇందుకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సహకరించి, కలసికట్టుగా పనిచేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సురేంద్రకుమార్, గురజాల సందీప్, నేతలు వైవీ రాజేశ్వరి, సీఎం విజయ, కోదండయాదవ్, చంద్రప్రకాష్, కటారి హేమలత, కాజూరు బాలాజి, త్యాగరాజన్, సప్తగిరి ప్రసాద్, అశోక్ ఆనంద్ యాదవ్, కాజూరు రాజేష్, ఈశ్వర్, శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2024 | 01:00 AM