అక్రమాలపై ఆధారాలివ్వండి!
ABN, Publish Date - Apr 30 , 2024 | 03:49 AM
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో చోటు చేసుకున్న అక్రమాలను నిరూపించేందుకు సంబంధిత ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 మూల్యాంకనంపై పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో చోటు చేసుకున్న అక్రమాలను నిరూపించేందుకు సంబంధిత ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను మే 8కి వాయిదా వేసింది. ఉద్యోగాలు చేసుకుంటున్న 167మందిని తొలగించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్.హరినాథ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దుచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో ఉద్యోగాలు పొందిన కొందరు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం ఇప్పటికే ఉద్యోగాలు పొందినవారిని విధుల నుంచి తొలగించవద్దని స్పష్టంచేసింది. ఈ అప్పీళ్లు సోమవారం మరోసారి విచారణకు రాగా సింగిల్ జడ్జి వద్ద గతంలో పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్, న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. 2021, డిసెంబరు 5నుంచి 2022, ఫిబ్రవరి 26మధ్య మాన్యువల్ విధానంలో మూల్యాంకనం జరిపారని ఆ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించలేదన్నారు. మార్చి 25నుంచి మే 26 మధ్య జరిపిన మూల్యాంకనం ఫలితాలను మాత్రమే వెల్లడించారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారన్నారు. ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 2021, డిసెంబరు 5 నుంచి 2022, ఫిబ్రవరి 26 మధ్య మాన్యువల్ విధానంలో మూల్యాంకనం జరిగిందన్న పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ సమయంలో కేవలం సన్నాహకాలు మాత్రమే జరిగాయని వివరించారు.
Updated Date - Apr 30 , 2024 | 07:42 AM