డయాఫ్రం వాల్కు టైం పడుతుంది!
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:12 AM
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులు ఒకదాని వెంట ఒకటిగా ప్రారంభించి..
2026 వరకు గడువు కోరుతున్న బావర్
తర్వాత మూడేళ్లకు ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తి: మేఘా
సమయం కుదించుకోవాలన్న మంత్రి నిమ్మల
అనంతరం సీఎంతో భేటీ ఏర్పాటు
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులు ఒకదాని వెంట ఒకటిగా ప్రారంభించి.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ఆశిస్తుండగా.. నిర్మాణ సంస్థలైన బావర్, మేఘా ఇంజనీరింగ్ మాత్రం మరింత సమయం పడుతుందని అంటున్నాయి. నవంబరులో వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి.. వచ్చే ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించాయి. నిర్మాణ సంస్థలు మాత్రం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపేజీ జలాలు ఉన్నందున అప్పటికి పూర్తిచేయలేమని స్పష్టం చేస్తున్నాయి. సోమవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు-ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు నిర్మాణ సంస్థలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. వాస్తవానికి సోమవారం నాటికి వాల్ నిర్మాణ షెడ్యూల్ను జలవనరుల శాఖకు మేఘా ద్వారా బావర్ అందించాలి. కానీ అందించలేదు. పైపెచ్చు యంత్రాల సమీకరణలో మరింత జాప్యం జరుగుతుందని.. ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నడుమ సీపేజీ జలాలు ఎక్కువగా ఉన్నందున అత్యంత ఖరీదైన యంత్రాలు పాడైపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ పేర్కొంది. డయాఫ్రం వాల్ను 2026 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తామని తెలిపింది. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి మూడు సీజన్లు పడుతుందని..
2029 నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉందని మేఘా సంస్థ తెలిపింది. గతంలో ఎల్అండ్టీ, బావర్ కలసి డయాఫ్రం వాల్ను ఏడాదిన్నరలోగా పూర్తి చేశారని మంత్రి నిమ్మల గుర్తుచేశారు.. ఇప్పుడు అనుభవం వచ్చినందున సమయం కుదించుకోవాలని సంస్థలకు స్పష్టం చేశారు. మంగళ, బుధవారాల్లో వరుస సమీక్షలు జరిపాక.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒక భేటీని ఏర్పాటు చేయడం ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. కాగా.. వెలగపూడి సచివాలయంలో వెలిగొండ ప్రాజెక్టు పనులపై మంత్రి రామానాయుడు సమీక్షించారు. రెండు రెగ్యులేటర్ల మధ్య వాల్ కట్టాల్సి ఉందని, దీనితో పాటు సొరంగాలు తవ్వడం ద్వారా వచ్చిన నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని టన్నెల్ చివరన కొత్తూరుకు తరలించాల్సి ఉందని అధికారులు ఆయనకు వివరించారు. లింక్ కెనాల్ పనులు, ఎత్తిపోతల పథకాలు, డిస్ట్రిబ్యూటరీ పనులపైనా మంత్రి సమీక్షించారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ, లైనింగ్ పనులను నవంబరులో మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Updated Date - Oct 22 , 2024 | 03:12 AM