ఏపీ అభివృద్ధి చెందేలా డ్రోన్ సదస్సు
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:55 AM
డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి దిశానిర్దేశం చేసేలా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేయండి
డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి దిశానిర్దేశం చేసేలా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆయన డ్రోన్ కార్పొరేషన్పై సమీక్ష నిర్వహించారు. అమరావతి డ్రోన్ సదస్సుకు చేసిన ఏర్పాట్ల గురించి ప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్, డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేశ్ కుమార్ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. డ్రోన్ సదస్సులో ఎక్కువ మంది యువత, విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో డేటా అనేది గొప్ప సంపదని అన్నారు. డ్రోన్ల యూఎస్ కేసె్సలో ఎన్నింటిని మనం ఉపయోగించుకోగలమనే దానిపై ఒక అంచనా ఉండాలని, ప్రధానంగా డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశాలున్న శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలన్నారు. కృత్రిమ మేధతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, డ్రోన్ల యూఎస్ కేసె్సలో ఏఐకి ఉన్న అవకాశాలను పరిశీలించి సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించవచ్చని, పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనా వేయొచ్చన్నారు. దోమల నివారణ, విద్యుత్ లైన్ల పర్యవేక్షణ, రహదారుల పర్యవేక్షణ.. ఇలా పలు రంగాలు, పలు విధాలుగా డ్రోన్లను వినియోగించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డి, సీఎస్ నీరబ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 03:55 AM