సజావుగా ఎన్నికల నిర్వహణకు కమిటీ
ABN, Publish Date - Mar 24 , 2024 | 12:29 AM
సహృదయ వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేశా మని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే..మాధవీలత అన్నారు.
ఎన్నికల ఫిర్యాదులకు డయల్ 1800-425-2540
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 23: సహృదయ వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేశా మని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే..మాధవీలత అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం మోడల్ ప్రవర్తనా నియమావళి ఫిర్యాదులపై జిల్లా స్థాయి ప్రమాణిక కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. జాతీయ,రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఏడుగురు జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు చెందిన వారిని నియమించామన్నారు. పట్నాల విజయకుమార్(బీఎస్పీ), బొమ్ముల దత్తు(బీజేపీ), మన్నవ రఘురాం(ఆమ్ఆద్మీపార్టీ), పి.అరుణ్ కిరణ్(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), అరిగెల అరుణకుమారి(కాంగ్రెస్), కేఎస్ జవహర్(టీడీపీ), జక్కంపూడి రాజా(వైసీపీ) కమిటీని వేశామన్నారు. ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితుల్లో కమిటీ నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల ఫిర్యాదులు నమోదుకు జిల్లాలో టోల్ ఫ్రీనెంబరు 1800-425-2540 కలెక్టరేట్లో ఏర్పాటు చేశామన్నారు. 24 గం టలు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ టోల్ప్రీ నెంబరు 1950 అందుబాటులో ఉందన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఆర్వో జి.నరసింహులు, సభ్యులు కన్వీనర్ బి.బాలస్వామి, సభ్యులు పి.ప్రదీప్ కుమార్, రాజకీయ పార్టీ ప్రతినిధులు పట్నాల విజయకుమార్, సీహెచ్.మణికృష్ణ, బి.రామచంద్రరావు, అరిగెల అరుణకుమారి, గెడ్డం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
51 హాబిటేషన్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : కలెక్టర్
రాజమహేంద్రవరం రూరల్, మార్చి 23: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డాక్టర్ కే.మాధవీలత తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం జిల్లా కలెక్టర్లతో ఉపాధి హామీ పనులు, తాగునీటి ఎద్దడి తదితర అంశాలపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. రానున్న వేసవిలో 51 హ్యాబిటేషన్స్ పరిఽధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్ల్లాలో కోరుకొండ, గోకవరం, సీతానగర, రాజానగరం, గోపాలపురం, రంగంపేట ప్రాంతాలు అప్ ల్యాండ్ కిందకు వస్తాయని చెప్పారు. జిల్లాలో 2023-24 ఆర్థిక ఏడాది కింద 52 లక్షల పని దినాలకు సుమారు 49 లక్షల పనిదినాలు లక్ష్యం సాధించినట్లు తెలిపారు. జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కోతలు ప్రారంభం అయ్యాయని మే రెండో వారం వరకు జరుగుతాయన్నారు.సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.బాలశంకరరావు, డ్వామా పీడీ ఏ.ముఖలింగం పాల్గొన్నారు.
Updated Date - Mar 24 , 2024 | 12:29 AM