భారీ వర్షం
ABN, Publish Date - May 15 , 2024 | 12:54 AM
దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆపసోపాలు పడ్డారు. అయితే సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు వీస్తూ వర్షం పడింది. గ్రామాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగాయి.
మామిడి, జీడిమామిడి తోటలకు నష్టం
యాదవోలులో పొంగిపొర్లిన వాగు డ్రైనేజీ
దేవరపల్లి/నల్లజర్ల/తాళ్లపూడి, మే 14: దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆపసోపాలు పడ్డారు. అయితే సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు వీస్తూ వర్షం పడింది. గ్రామాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగాయి.అక్కడక్కడ మొక్కజోన్న పంట వర్షపు నీటికి తడిసింది. ఈ వర్షం వల్ల మామిడి, జీడిమామిడి తోటలకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడంతో వృద్ధులు, చిన్నారులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది. దేవరపల్లి మండలం యాదవోలు వాగు డ్రైనేజీ పొంగిపొర్లింది. డ్రైన్కు ఇరువైపులా ఉన్న ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ డ్రైనేజీ పూడిక తీయకపోవడం, ప్లాస్టిక్ బాటిల్స్ పేరుకుపోయి ఉండడం వల్ల నీరు ముందుకు పారక డ్రైన్ పొంగి పొర్లింది. పంచాయతీ అధికారులు పూడిక తీసి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కొద్దిపాటి వర్షానికే ఇలా డ్రైన్ పొంగి ఇళ్లలో నీరు చేరిందని, వచ్చే వర్షాకాలంలో భారీ వర్షాలు పడితే ఈ వాగుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు ముంపునకు గురవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేవరపల్లిలో సాయంత్రం గాలి, వాన పడడంతో పోలింగ్ స్టేషన్ సమీపంలో దేవరపల్లి-గుం డుగొలను రహదారిపై భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది. రోడ్డుకు సగం పైగా పడి ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాన్ని అధికారులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. తాళ్లపూడిలో సుమారు 20 నిమిషాల పాటు కురిసిన వర్షానికి మెయిరోడ్డు జలమయమైంది. వాహనదారులుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని లేదంటే వర్షాకాలంలో చాలా ఇబ్బం దులు ఎదుర్కోవలసి వస్తుందని పలువురు అంటున్నారు.
Updated Date - May 15 , 2024 | 12:54 AM