19 నుంచి కోరుకొండ తీర్థం
ABN, Publish Date - Mar 14 , 2024 | 01:32 AM
శతాబ్దాల చరిత్ర కలిగిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ తెలిపారు.
కోరుకొండ,మార్చి13: శతాబ్దాల చరిత్ర కలిగిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ముఖ మండపం నందు దేవస్థానం చైర్మన్ పరాసర రంగరాజభట్టర్ స్వామి, దేవస్థానం పర్యవేక్షణాధికారి కాపవరపు సూర్యనారాయణ, ఎస్వీవీఎస్ఎన్ మూర్తి, చంగన వీర్రాజు, పీఎస్ అనీల్కుమార్ తదితరులు ఉత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. దీని ప్రకారం ఈ నెల 19వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వైఖానస ఆగమ పండితులు పాణింగపల్లి పవన్కుమార్ ఆచార్యులు, అనువంశిక అర్చక స్వాములు స్వామి వారి కోనేరు వద్ద నుంచి పుట్ట మన్ను తెచ్చి అంకురార్పణ, ధ్వజారోహణం చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారి రథోత్సవం. రాత్రి 9 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం, 21వ తేదీ గురువారం కొండపైన, కొండ దిగువున స్వామి వారి దర్శనాలు, రాత్రి 9గంటలకు స్వామి వారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం నిత్యోపాసనతో స్వామివారి దర్శనాలు ప్రారంభమవతాయి. రాత్రి 7 గంటలకు స్వామి వారి ఆలయ ముఖ మండపంలో వేద పండితుల సమక్షంలో స్వామి వారికి సదస్యం జరుగును. రాత్రి 9 గంటలకు హనుమద్ వాహనంపై స్వామి గ్రామోత్సవం జరుగుతుంది. 23వ తేదీ శనివారం స్వామి వారి నిత్యోపాసన అనంతరం దర్శన ఏర్పాట్లు చేస్తారు. రాత్రి 9గంటలకు స్వామి వారికి గజవాహనంపై గ్రామోత్సవం. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీ రంగరాజ స్వామి ఆలయంలో రంగరాజస్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 24వ తేదీ ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, శ్రీ అనంతపద్మనాభ స్వామివారి సమక్షంలో దేవుని కోనేటి వద్ద శ్రీ చక్ర పెరుమాళ్ళకు పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అనంతరం చక్రతీర్థం జరుగుతుంది. సాయంత్రం ధ్వజారోహణ, అద్దాల సేవ, ఊంజల సేవ నిర్వహిస్తారు. రాత్రి 9గంటలకు స్వామివారి శేషవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 25వ తేదీ సోమవారం సాయంత్రం స్వామి వారికి ద్వాదశప్రదక్షిణలు, ద్వాదశ నివేదనలు, పర్యాంక శయనోత్సవం, స్త్రీ పుష్పయాగం జరుగుతుందని రంగరాజభట్టర్ స్వామి తెలిపారు.
పసిబాలుడిని వదిలేశారు
సర్పవరం జంక్షన్, మార్చి 13: ఎవరికి ఏం కష్టమొచ్చిందో..ఏం అడ్డం వచ్చిందో తెలియదు కానీ రోజుల వయస్సు ఉన్న పసి బాలుడిని కాకినాడ బోట్క్లబ్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. కాకినాడ ఒకటో డివిజన్ పరిధిలో బోట్క్లబ్ పార్కు ఉంది. దీని ప్రధాన ద్వారం పిఠాపురం వెళ్లే రహదారిలో ఉంది. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో పార్కులో నుంచి చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న విషయాన్ని గమనించిన సందర్శకులు గోనె సంచి మూట విప్పి చూడటంతో రోజుల వయసు ఉన్న బాబు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడం, శరీరంపై పొక్కులు రావడాన్ని గమనించి, వెంటనే 108 కు సమాచారం అందించగా, మెరుగైన చికిత్స కోసం చిన్నారి బాలుడిని జీజీహెచ్కు తరలించారు. వైద్యులు ఎన్ఐసీయూలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చిన్నారి వయసు 3 నుంచి 5 రోజులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చిన్నారిని పార్కులో వదిలేసి అప్పటికే 10 నిమిషాలు అయి ఉంటుందని, వెంటనే సందర్శకులు గమనించి సమాచారం ఇవ్వడంతో బాలుడికి ప్రమాదం తప్పిందని వైద్యులు భావిస్తున్నారు. బోట్క్లబ్ పార్కు లోపల, బయట వీధికుక్కల గుంపు ఉందని, చిన్నారిని కుక్కలు చూచి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Mar 14 , 2024 | 01:32 AM