మాజీ మంత్రి పినిపే తనయుడి అరెస్టు
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:25 AM
జగన్ హయాంలో రెండున్నరేళ్ల కిం దట అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన దళిత వ లంటీర్ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
వలంటీర్ హత్య కేసులో సూత్రధారిగా గుర్తింపు
తమిళనాడులోని మదురైలో సినీఫక్కీలో కారును
చేజ్ చేసి శ్రీకాంత్ను పట్టుకున్న ఏపీ పోలీసులు
అమలాపురం/రామచంద్రపురం/చెన్నై, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో రెండున్నరేళ్ల కిం దట అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన దళిత వ లంటీర్ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పినిపే విశ్వరూ ప్ తనయుడు పినిపే శ్రీకాంత్ను సోమవారం తమిళనాడులోని మదురై సమీపంలో ఏపీ పోలీసులు సినీ ఫక్కీలో అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్య కేసు విచారణ వేగవంతమైంది. దీంతో శ్రీకాంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్నట్టు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వం లో ప్రత్యేక పోలీస్ బృందం దక్షిణాది జిల్లాల్లో మకాం వేసి నిందితుడి కదలికలను నిశితంగా గమనించింది. ఆదివారం రాత్రి తూత్తుకుడి నుంచి మదురైకు(150 కిలోమీటర్లు) శ్రీకాంత్ కారులో బయలుదేరినట్టు సమాచారం రావడంతో పోలీసులు అనుసరించారు. ఆ విషయాన్ని పసిగట్టిన శ్రీకాంత్ తన కారును అతివేగంతో ముందుకునడిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సినీ ఫక్కీలో చేజ్ చేసి.. మదురై జిల్లా తిరుమంగళంలో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరి చి, ట్రాన్సిట్ వారెంట్పై శ్రీకాంత్ను ఏపీకి తరలించా రు. కాగా, హత్య వెనుక మహిళా సంబంధాలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజకీయ ప్రోద్బలంతో..
కోనసీమ జిల్లాలోని అయినవిల్లి గ్రామంలో వలంటీర్గా పనిచేస్తున్న దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్(27) జూన్ 6, 2022న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత మృతదేహం కోటిపల్లి రేవులో దొరికింది. ఈ హత్య కేసుపై విచారణ జరపాలని ప్రజాసంఘాలు అప్పట్లో ఆందోళన చేసినా రాజకీ య ప్రోద్బలంతో కేసును పక్కన పెట్టేశారు. అయితే, రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చాక దుర్గాప్రసాద్ భా ర్య ఆదర్శ.. మంత్రి వాసంశెట్టి సుభాశ్ను కలిసి విచారణ జరిగేలా చూడా లని విన్నవించారు.
మంత్రి సుభాశ్ కుట్ర: విశ్వరూప్
తన తనయుడి అరెస్టుపై మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. తాను తిరువనంతపురం వెళ్తుండగా తనకు ఈ విషయం తెలిసిందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి వాసంశెట్టి సుభాశ్ తన కుమారుడిపై అక్రమ కేసును బనాయించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
విశ్వరూప్ అడ్డుపడ్డారు: మంత్రి వాసంశెట్టి
పినిపే శ్రీకాంత్ అరెస్టుపై మంత్రి వాసంశెట్టి సుభా శ్ స్పందించారు. ఈ అరెస్టు వెనుక కుట్ర జరిగిందన్న విశ్వరూప్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎలాంటి కక్ష సాధింపులు లేవన్నారు. శ్రీకాంత్కు అత్యంత సన్నిహితుడైన దుర్గాప్రసాద్ను ఎందుకు హత్యచేయాల్సి వచ్చిందో విచారణలో తెలుస్తుందన్నారు. సోమవారం రామచంద్రపురంలో మాట్లాడుతూ.. మృతుడు దుర్గాప్రసాద్ తన కుమారుడికి ‘శ్రీకాంత్’ అని పేరు పెట్టిం ది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ కేసులో అమలాపురానికి చెందిన రౌడీషీటర్లు ఉన్నారని, వారు కూడా బయటకు వస్తారని అన్నారు. హత్య అనంతరం.. దుర్గాప్రసాద్ భార్య వద్దకు అప్పటి మంత్రి విశ్వరూప్ వెళ్లి కేసు పెట్టవద్దని, రెండు ఎకరాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? అన్నారు.
ప్లాన్ శ్రీకాంత్దే కీలక నిందితుడి వాంగ్మూలం
దుర్గాప్రసాద్ హత్యకు పినిపే తనయుడు శ్రీకాంతే పక్కాప్లాన్ చేసినట్టు కీలక నిందితుడు పోలీసులకు తెలిపారు. ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామానికి చెందిన వడ్డి ధర్మేశ్ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ధర్మేశ్ నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. ‘‘జూన్ 5, 2022న అనాతవరం దగ్గరున్న గ్రాండ్ పార్క్ వద్ద శ్రీకాంత్తోపాటు మరికొందరు మద్యం సేవించారు. ఆ సమయంలో నేను కూడా ఉన్నా. మద్యం తాగుతున్న సమయంలో దుర్గాప్రసాద్ హత్యకు శ్రీకాంత్ పక్కా ప్లాన్ చేశారు. 2022, జూన్ 6వ తేదీ సాయంత్రం ముక్తేశ్వరం సెంటర్ కు నలుగురు వ్యక్తులు కారు వేసుకుని వస్తారని, వారికి దుర్గాప్రసాద్ ఉన్న ప్రదేశాన్ని చూపించాల ని శ్రీకాంత్ నన్ను ఆదేశించారు. దీంతో నేను దుర్గా ప్రసాద్ను వారికి చూపించా. ఆ తర్వాత వారు దుర్గాప్రసాద్తో మాటలు కలిపి పడవలో కోటిపల్లి వైపునకు తీసుకెళ్లి దాడి చేశారు. మెడకుతాడు బిగించి ఊపిరి ఆడకుండా చంపేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పడేశారు. దుర్గాప్రసాద్.. శ్రీకాంత్కు అత్యంత సన్నిహితుడు’’ అని ధర్మేశ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాగా, తమపై ఎవరికీ అనుమానం రాకుండా దుర్గాప్రసాద్ భార్య ఆదర్శ, వారి ఇద్దరి పిల్లలతోపాటు కొందరు యువకులను పిలిచి వలంటీర్ను హత్య చేసిన నిందితులను అరెస్టు చేయాలని నిరసన చేపట్టినట్టు ధర్మేశ్ పోలీసులకు తెలిపారు. అదేవిధంగా దుర్గాప్రసాద్ కుటుంబానికి పినిపే శ్రీకాంత్ రూ.లక్ష సాయం చేశారని, ఎస్పీని కలిసి విచారణ చేపట్టాలని కోరారని పేర్కొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 04:25 AM