కాంగ్రెస్ వైపు జగన్ మొగ్గు!
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:52 AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని బీజేపీ నేత, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలిపారు.
సత్యకుమార్ ధ్వజం.. ఢిల్లీలో అమిత్షాతో భేటీ
న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని బీజేపీ నేత, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలిపారు. హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ చేసిన ప్రకటనలను, ఎన్నికల కమిషన్, ఈవీఎంలను తప్పుబట్టిన తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సత్యకుమార్ సోమవారమిక్కడ హోంమంత్రిని కలిశారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమిత్ షాను ఆయన కలవడం ఇదే మొదటిసారి. జగన్ బెంగళూరులో మకాంవేసి అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి రాష్ట్రప్రభుత్వంపై బురదజల్లుతున్నారని సత్యకుమార్ ఈ సందర్భంగా విమర్శించారు. నిజానికి ఆయన సృష్టించిన సమస్యలు, అరాచక పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని.. రూ.11 లక్షల కోట్ల అప్పులు చేసి పోయారని చెప్పారు. అప్పులు తీర్చడానికి ఏటా రూ.72 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని చెప్పినప్పుడు అమిత్ షా ఆశ్చర్యపోయినట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయం రూ.96 వేల కోట్లయితే అందులో అధిక భాగం జీతాలు, పింఛన్లకే పోతోందని సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం చాలా కష్టతరంగా ఉందన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు సంయమనంగా పాలన నిర్వహిస్తున్నారని, కూటమి నేతల మఽధ్య సమన్వయం బాగుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ఇవ్వకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో తన నియోజకవర్గం ధర్మవరంలో అమిత్ షా పర్యటన తర్వాతే రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాగానే జరుగుతోందని అమిత్షాకు తెలిపారు.
Updated Date - Oct 22 , 2024 | 07:39 AM