ప్రేమ పేరుతో యువతికి వేధింపులు!
ABN, Publish Date - Apr 04 , 2024 | 01:00 AM
ఇద్దరు యువకులు యువతిని వేధిస్తుండటంతో విసిగివేశారిన తండ్రి పోలీసులు ఆశ్రయించాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు సదరు తండ్రి దుకాణంలో గంజాయిని డంపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి, కటకటాల పాలైన సంఘటన గుడివాడలో సంచలనం రేకెత్తించింది.
గుడివాడ, ఏప్రిల్ 3: ఇద్దరు యువకులు యువతిని వేధిస్తుండటంతో విసిగివేశారిన తండ్రి పోలీసులు ఆశ్రయించాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు సదరు తండ్రి దుకాణంలో గంజాయిని డంపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి, కటకటాల పాలైన సంఘటన గుడివాడలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పెద్దవీధికి చెందిన వ్యక్తికి రైతు బజారు సమీపంలో ఫ్యాన్సీ దుకాణం ఉంది.
అతడి కుమార్తెను కొంతకాలంగా ధనాల ప్రవీణ్, శశిలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో తండ్రి ఒన్టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కాలయాపనతో వేధింపులు మరింత పెరిగాయి. ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు కోపోద్రిక్తులై పథకం ప్రకారం తండ్రి ఫ్యాన్సీ దుకాణంలో గంజాయి డంప్ చేశారు. అది వీడియో తీసి బ్లాక్మెయిల్కు దిగారు. విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటే తమకు రూ.2లక్షలు ఇవ్వాలని, లేకుంటే పోలీసులకు రూ.5లక్షలు యిచ్చుకోవాల్సి వస్తుందని బెదిరించడంతో సమీప దుకాణదారులు, స్థానికులు యువకులను నిలదీశారు. దీంతో యువకులు తమపై దుకాణదారుడు దౌర్జన్యం చేస్తున్నాడని, దుకాణంలో గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టు టూటౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. 10నిమిషాల్లోనే టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దుకాణదారుడిని స్టేషన్కు తరలించారు.
తన కుమార్తెను వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించని పోలీసులు.. ఇంత త్వరగా రావడం పట్ల దుకాణదారుడు ఆశ్చర్యపోయాడు. స్థానికులు పెద్దఎత్తున స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా యువకులే గంజాయిని డంప్ చేశారని టూటౌన్ పోలీసులు నిర్ధారించారు. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ దుర్గారావు తెలిపారు. దీంతో గంజాయి వారికి ఎక్కడి నుంచి వచ్చిందీ.. అమ్మకాలు చేస్తున్నదెవరో తేల్చేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.
Updated Date - Apr 04 , 2024 | 01:00 AM