మరో ఐదుగురికి తీవ్ర అస్వస్థత
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:54 PM
ఆదోని మండిగిరి పంచాయతీ పరిధిలోని ఆర్జీ నగర్లో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల హాస్టల్ విద్యార్థినుల్లో మరో ఐదుగురు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
రేకుల షెడ్డు వేడి, ఉడకని అన్నం వల్లే అంటున్న విద్యార్థినులు
ఆదోని/ఆదోని (అగ్రికల్చర్), సెప్టెంబరు 20 : ఆదోని మండిగిరి పంచాయతీ పరిధిలోని ఆర్జీ నగర్లో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల హాస్టల్ విద్యార్థినుల్లో మరో ఐదుగురు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉద యం కళాశాలకు వెళ్లిన విద్యార్థినిలు ఉదయం ముగ్గురు స్పృహ తప్పి పోగా, మధ్యాహ్నం మరో ఇద్దరు తీవ్ర అస్వస్థత కు గురి కావడంతో కళాశాల ప్రిన్సిపాల్ సంజయన్న, అధ్యాపకులు హుటాహుటిన ఆంబులెన్స్లో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గురువారం ఇందు భాగ్యమ్మ అస్వస్థతకు గురయ్యారు. ఇందు అనే విద్యార్థినికి బీపీ కంట్రోల్ కాక పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. సింధు, శిరీష, మహాలక్ష్మి, రాజేశ్వరి, లేఖన అనే విద్యార్థినులు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా రేకుల షెడ్డు వల్ల అధిక వేడికి గురైనట్లు డా. శ్రీరాములు నాయక్ తెలిపారు. వారి పరిస్థితి ప్రస్తుతం బాగుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను తహసీల్దార్ శివరాముడు పరామర్శించి వైద్యులను, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్కు వెళ్లి విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించడంతో డా. శ్రీరాం నాయక్, డా. జగదీ్షతోపాటు మరో ముగ్గురు వైద్యులు హాస్టల్ చేరుకొని వారితో మాట్లాడారు. హాస్టల్ విద్యార్థినులు ఉడకని అన్నం, నీళ్ల సాంబార్, ఆకు కూర పప్పు వడ్డిస్తున్నారని వాపోయారు. ప్రతి రోజూ మధ్యాహ్నం పచ్చి మిరపకాయల పప్పును క్యారియర్లో పంపుతున్నారని, అది తినేలోపు చెడిపోతోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. సాయంత్రం వేళ కనీసం స్నాక్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. హాస్టల్ వార్డెన్ పరిమళమ్మను అడిగితే... తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేకుల షెడ్డు కింద ఉక్కపోతతో అల్లాడుతున్నామని, ఫ్యాన్లు కూడా లేవని తెలిపారు.
Updated Date - Sep 20 , 2024 | 11:54 PM