బయలు వీరభద్ర స్వామికి ఆర్జిత పరోక్ష సేవ
ABN, Publish Date - Jul 06 , 2024 | 12:04 AM
శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు.
శ్రీశైలం, జూలై 5: శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్ర స్వామికి పంచామృతాలతో, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారి పరోక్ష సేవలో మొత్తం 18 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలు వీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పరోక్షసేవ ద్వారా పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. శ్రీశైలదేవస్థానం.ఓఆర్జీ దేవస్థానం వెబ్సైట్లో రూ. 1,116 లు సేవా రుసుమును చెల్లించి ఏ సేవలో అయినా పాల్గొనవచ్చు. స్వామివారి రుద్రాభి షేకం, అమ్మవారి కుంకుమార్చన మినహా మిగతా అన్నీ సేవలను భక్తులు శ్రీశైలటీవీ, యూట్యూబ్ చానల్ ద్వారా వీక్షించవచ్చని ఈవో తెలిపారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయలసేవను వైభవంగా నిర్వహించారు. అలాగే గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం దేవస్థానం విశేష పూజలు నిర్వహించింది.
Updated Date - Jul 06 , 2024 | 12:04 AM